హైదరాబాద్ లోని గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ దగ్గర మల్టీ లెవెల్ ఫ్లైఓవర్, అండర్ పాస్ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రిపుల్ ఐటీ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. బుధవారం ( ఏప్రిల్ 8 ) నుంచి సుమారు ఏడాది పాటు ఈ మార్పు తప్పదని పేర్కొన్నారు పోలీసులు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వివిధ మార్గాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ అమల్లో ఉన్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు సైబరాబాద్ పోలీసులు.
ట్రాఫిక్ డైవర్షన్స్ ఇలా:
- గచ్చిబౌలి జంక్షన్ నుండి లింగంపల్లి వైపు వచ్చే ట్రాఫిక్ను IIIT జంక్షన్ దగ్గర నుంచి విప్రో జంక్షన్ రైట్ టర్న్ - గౌలిదొడ్డి గోపన్పల్లి జంక్షన్ - నల్లగండ్ల లింగంపల్లి వైపు మళ్లించబడుతుంది.
- గోపన్పల్లి తండా గౌలిదొడ్డి, క్యూ-సిటీ, కోకాపేట్ నుండి IIIT జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్ను విప్రో జంక్షన్ దగ్గర నానక్రామ్గూడ రోటరీ-2 లెఫ్ట్ టర్న్ - ORR వైపుగా - గచ్చిబౌలి జంక్షన్ వైపు మళ్లించబడుతుంది.
- లింగంపల్లి నుండి గచ్చిబౌలి జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్ను SMR/HCU బస్ డిపో జంక్షన్ దగ్గర మజీద్బండ శ్రీరామ్నగర్ - బొటానికల్ జంక్షన్ రైట్ టర్న్ - ఉడిపి హోటల్ - యూ-టర్న్ ZPHS గచ్చిబౌలి జంక్షన్ వైపు మళ్లించబడుతుందని తెలిపారు పోలీసులు.
ఈ డైవర్షన్స్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమల్లో ఉంటాయని.. ఆఫీసులకు వెళ్లేవారు డైవర్షన్స్ దృష్టిలో ఉంచుకొని... తగినట్టుగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు పోలీసులు. సుమారు ఏడాది పాటు ఈ మార్పులు ఉంటాయని... ప్రజలు సహకరించాలని కోరుతున్నారు పోలీసులు.
