- రూ.500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు
హైదరాబాద్: ఫ్రీడమ్ బ్రాండ్ వంటనూనెలు అమ్మే హైదరాబాద్కు చెందిన జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ తెలంగాణలో దాదాపు 50 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ ఎడిబుల్ ఆయిల్ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. రూ.500 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో పెట్టబోయే ఈ ఫెసిలిటీకి1,000 టన్నుల కెపాసిటీ ఉంటుంది. ఇక్కడ ఆయిల్ ప్రాసెసింగ్, సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ సదుపాయాలు ఉంటాయి. హైదరాబాద్లో శుక్రవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ (జీఈఎఫ్) ఎండీ ప్రదీప్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పామాయిల్ వంటి నూనెగింజల సాగును ఎంకరేజ్ చేస్తుండటంతో ఇక్కడ ప్లాంటు పెట్టాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. తమ కంపెనీకి కాకినాడ, కృష్ణపట్నంలలో రిఫైనింగ్ యూనిట్లు ఉన్నాయని, వీటి కెపాసిటీ రోజుకు 2,615 మెట్రిక్ టన్నులని వెల్లడించారు. ఇదిలా ఉంటే కిందటి ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలపరంగా తమ సన్ఫ్లవర్ ఆయిల్కు నంబర్వన్ ర్యాంకు వచ్చిందని చెప్పారు.