న్యూఢిల్లీ: లాక్డౌన్ను దృష్టిలో పెట్టుకొని ఏటీఎం ట్రాన్సాక్షన్లు, మినిమమ్ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ను మెయింటైన్ చేయడం వంటి వాటిపై గతంలో ప్రభుత్వం కొన్ని మినహాయింపులనిచ్చింది. ఇవి జూన్ 30 తో ముగియడంతో ఈ నెల నుంచి మళ్లీ ఈ రూల్స్ అమలులోకి వచ్చాయి.
ఏటీఎం విత్డ్రాయల్పై ఛార్జ్
అన్ని రకాల ఏటీఎం ట్రాన్సాక్షన్లపై జూన్ 30 వరకు ఎటువంటి ఛార్జీలు ఉండవని మార్చి నెలలో ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ నెల నుంచి ఫ్రీ కాని ఏటీఎం విత్డ్రాయల్స్పై ముందులానే ఛార్జీలను వసూలు చేస్తున్నారు.
మినిమమ్ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్
బ్యాంక్ అకౌంట్లో మినిమమ్ అమౌంట్ను మెయింటైన్ చేయడంపై జూన్ 30 వరకు ప్రభుత్వం మినహాయింపులిచ్చింది. ఈ నెల నుంచి బ్యాంక్ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే అదనపు ఛార్జీలను చెల్లించాల్సిందే
అటల్ పెన్షన్ యోజన అకౌంట్స్
జూన్ 30 వరకు అటల్ పెన్షన్ యోజన(ఏపీవై) కోసం బ్యాంకుల నుంచి ఆటోమెటిక్గా డబ్బులు డిడక్ట్ అవ్వడాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ నిలిపివేసింది. ఈ నెల నుంచి ఆటో డెబిట్ తిరిగి అమల్లోకి వచ్చింది. ఏప్రిల్–అగష్టు ఏపీవై కంట్రిబ్యూషన్లను సెప్టెంబర్ 30 లోపు రెగ్యులరైజ్(ఆ నెలల డబ్బులను కట్టడం) చేసుకుంటే ఎటువంటి పెనాల్టీ చెల్లించాల్సిన అవసరం ఉండదు.
మ్యూచువల్ ఫండ్స్పై స్టాంప్ డ్యూటీ
ఈ నెల నుంచి మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలుపై స్టాంప్ డ్యూటీని చెల్లించాల్సి ఉంటుంది. సిస్టమేటిక్ ఇన్వెస్ట్ ప్లాన్(సిప్), సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ) ద్వారా ఇన్వెస్ట్ చేస్తే స్టాంప్ డ్యూటీని వసూలు చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు లేదా ట్రాన్స్ఫర్పై 0.005 శాతం స్టాంప్ డ్యూటీని విధిస్తారు. ఈ కొత్త రూల్ మ్యూచువల్ఫండ్స్కు వర్తిస్తుంది. స్టాంప్ డ్యూటీ ప్రభావం 90 రోజులు, అంత కంటే తక్కువ రోజుల హోల్డింగ్స్పై చూపనుంది.