రూ.6 వేల జీతం నుంచి రూ.2 కోట్లు, ఐదు ఇళ్లు కూడబెట్టే స్థాయికి.. వెలుగులోకి ప్రభుత్వ ఇంజనీర్ అవినీతి బాగోతం

రూ.6 వేల జీతం నుంచి రూ.2 కోట్లు, ఐదు ఇళ్లు కూడబెట్టే స్థాయికి.. వెలుగులోకి ప్రభుత్వ ఇంజనీర్ అవినీతి బాగోతం

ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరు దేశాన్ని దొంగల్లా దోచేస్తున్నారు. ఉద్యోగాన్ని, హోదాను అడ్డం పెట్టుకుని కోట్లల్లో అక్రమాస్తులను కూడబెట్టుకుంటున్నారు. ఇలా 6 వేల జీతంతో మొదలైన ఒక ప్రభుత్వ ఇంజనీర్ 2 కోట్ల అక్రమాస్తుల కూడబెట్టిన ఘటన ఒడిశాలో వెలుగుచూసింది. ఒడిశా విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో ఈ ప్రభుత్వ ఉద్యోగి అవినీతి బయటపడింది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బెహెరా అనే ఇంజనీర్.. కంధమాల్‌లోని బలిగూడలో ఇంటెగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ (ITDA)లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 1999లో జూనియర్ ఇంజనీర్గా సర్వీస్లో చేరిన బైకుంత నాథ్ బెహెరా 6 వేల జీతంతో ఉద్యోగంలో చేరాడు. అప్పటి నుంచి పలు ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీల్లో పనిచేశాడు. ఇంజనీరింగ్ అసైన్మెంట్స్ చేశాడు. 2026లోనే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పదోన్నతి పొందాడు. 

►ALSO READ | Raghava Lawrence: ‘జూన్ 11న అన్నీ చెబుతా’.. పొలిటికల్ ఎంట్రీపై రాఘవ లారెన్స్ క్లారిటీ

బెహెరాపై ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో భువనేశ్వర్ స్పెషల్ విజిలెన్స్ కోర్టు వారెంట్ జారీ చేసింది. ఈ వారెంట్ ఆధారంగా.. ఒడిశా విజిలెన్స్ బెహెరా ఇంట్లో సోదాలు నిర్వహించింది. జాజ్‌పూర్ జిల్లాలోని చంద్రశేఖర్‌పూర్, శైలశ్రీ విహార్, కానన్ విహార్, ధర్మశాల, బరిపడలలోని బెహెరా ఇండ్లలో, బలిగూడలోని అతని అధికారిక నివాసం, అతని ఆఫీస్ రూంలో సోదాలు చేశారు. ఈ సోదాల్లో మొత్తం.. ఐదు బహుళ అంతస్తుల భవనాలు బెహెరా, అతని కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నట్లు గుర్తించారు.

భువనేశ్వర్‌లోని నీలాద్రి విహార్‌లో సుమారు 10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం ఒకటి. దర్యాప్తు అధికారులు భువనేశ్వర్, జాజ్‌పూర్ జిల్లాలలో మరో నాలుగు నివాస ఆస్తులను కూడా గుర్తించారు. భువనేశ్వర్‌లోని ప్రధాన ప్రాంతాల్లోని ఏడు ప్లాట్లతో పాటు, జాజ్‌పూర్, బరిపడాలలో మరికొన్నింటితో సహా మొత్తం 13 భూములను గుర్తించారు. ఆ కుటుంబానికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్న బ్యాంకు లాకర్ల నుంచి సుమారు రూ. 2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. బెహెరా ఆస్తిపాస్తులపై విజిలెన్స్ సోదాలు కొనసాగుతున్నాయి.