ప్రపంచ అధినేతలకు క్లాస్ చెప్పనున్న మన గిరిజన మహిళలు

ప్రపంచ అధినేతలకు క్లాస్ చెప్పనున్న మన గిరిజన మహిళలు

మిల్లెట్ సాగు గురించి తమ అంతర్దృష్టిని పంచుకోవడానికి ఒడిశాకు చెందిన గిరిజన మహిళలను న్యూఢిల్లీలో జరిగే G20 సమ్మిట్‌కు ఆహ్వానించారు. తరతరాలుగా గుర్తింపు లేకుండా పలు రంగాల్లో కష్టపడి పనిచేస్తున్న ఈ మహిళలకు ఇది చారిత్రాత్మక ఘట్టం. ప్రపంచ నాయకులు, విధాన రూపకర్తలతో వారి జ్ఞానాన్ని, అనుభవాన్ని పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సదస్సు మంచి వేదిక కానుంది.

36 ఏళ్ల గిరిజన మహిళా రైతు, ఒడిశాలోని భూమియా కమ్యూనిటీకి చెందిన రైమతి ఘురియా, మయూర్‌భంజ్ జిల్లా మతియాగర్ గ్రామానికి చెందిన 45 ఏళ్ల గిరిజన మహిళా రైతు సుబాసా మొహంతాలను సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరిగే G20 సదస్సులో పాల్గొనేందుకు ఆహ్వానం అందుకున్నారు. ఇక వీరిలో రైమతి 72 కంటే ఎక్కువ సాంప్రదాయక రకాల దేశీయ వరిని, 30 కంటే ఎక్కువ రకాల మినుములను సంరక్షించింది. “G20 శిఖరాగ్ర సమావేశానికి హాజరుకావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సమావేశంలో కనీసం 20 దేశాల నాయకులు పాల్గొంటారని నేను విన్నాను. నేను కుంద్రా బాటి మడియా (ఫింగర్ మిల్లెట్), దాన్ని పండించే గిరిజన పద్ధతిని ప్రదర్శిస్తాను" అని ఆమె ఈ సందర్భంగా తెలిపింది. "మిల్లెట్ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. ఇది వివిధ వ్యాధుల నివారణగా పనిచేస్తుంది. నాకు ఈ అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి ధన్యవాదాలు" అని సుబాస మొహంత చెప్పింది.
 
ఒడిశాకు చెందిన ఈ గిరిజన మహిళలు పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే సుస్థిర వ్యవసాయ పద్ధతుల గురించి తమ జ్ఞానాన్ని ఈ సదస్సులో పంచుకోనున్నారు. ఈ పద్ధతులలో అరటి ఆకులు, ఆవు పేడ వంటి సహజ ఎరువులను ఉపయోగించడం, పంట మార్పిడి వంటి సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించడం వంటివి ఉన్నాయి. నేల కోతను తగ్గించడానికి, నీటిని సంరక్షించడానికి సాంప్రదాయ పద్ధతులు ఎలా సహాయపడతాయో కూడా వారు చర్చిస్తారు. వాతావరణ మార్పుల యుగంలో ఆహార ఉత్పత్తిని కొనసాగించడానికి సరైన భూ నిర్వహణ అవసరం అవుతున్న ఈ సమయంలో ఈ చర్చ చాలా ముఖ్యమైనదని పలువురు భావిస్తున్నారు.