నా వాదన వినకుండా తీర్పు వచ్చింది.. అనర్హత వేటుపై సుప్రీంకోర్టు వెళ్తా : గద్వాల్ ఎమ్మెల్యే

నా వాదన వినకుండా తీర్పు వచ్చింది.. అనర్హత వేటుపై సుప్రీంకోర్టు వెళ్తా : గద్వాల్ ఎమ్మెల్యే

తెలంగాణ హైకోర్టు తీర్పుపై గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి స్పందించారు. తాను అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చానని తన ప్రత్యర్థులు హైకోర్టులో కేసు వేశారని చెప్పారు. న్యాయస్థానం కూడా తనకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా.. తన వాదనలు వినకుండా తనపై అనర్హత వేటు వేసిందని తెలిపారు. న్యాయస్థానంపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. తనపై తెలంగాణ హైకోర్టు వేసిన అనర్హత వేటుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానన్నారు. తనతో గద్వాల్ నియోజకవర్గం ప్రజలు అండగా ఉన్నారని, రానున్న ఎన్నికల్లో 50 వేల మెజారిటీతో మళ్లీ గద్వాల్ ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

హైకోర్టు తీర్పుపై  డీకే అరుణ హర్షం

తెలంగాణ హైకోర్టు తీర్పుపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. ఆలస్యమైనా తనకు న్యాయం జరిగిందన్నారు. ఎన్నికల అఫిడవిట్ లో కృష్ణమోహన్ రెడ్డి కొన్ని అంశాలను చూపించలేదని, ఇదే విషయాన్ని తాను హైకోర్టు దృష్టికి తీసుకొచ్చానని చెప్పారు. విచారణ జరిపిన తర్వాత కృష్ణమోహన్ రెడ్డిపై హైకోర్టు అనర్హత వేటు వేసి, తనను ఎమ్మెల్యేగా గుర్తించిందన్నారు.   

గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని తెలంగాణ హైకోర్టు అనర్హుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించారని కృష్ణమోహన్ రెడ్డిపై న్యాయస్థానం వేటు వేసింది. రెండో స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి డీకే అరుణను హైకోర్టు ఎమ్మెల్యేగా గుర్తించింది. కృష్ణమోహన్ రెడ్డికి రూ.3 లక్షల జరిమాన విధించింది. ఇందులో రూ.50 వేలు డీకే అరుణకు ఇవ్వాలని ఆదేశించింది. 

కృష్ణమోహన్ రెడ్డి తన ఆస్తులకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించలేదని.. అదే విధంగా ఓట్ల ఎన్నికల సమయంలో వీవీ పాడ్స్ కు సంబంధించిన చీటీలను సరిగా లెక్కించలేదంటూ.. హైకోర్టులో రెండు పిటీషన్లు దాఖలు చేశారు డీకే అరుణ. ఈ రెండు పిటీషన్లను విచారించిన హైకోర్టు.. కృష్ణమోహన్ రెడ్డి తన ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించలేదని నిర్థారణకు వచ్చి.. ఆయన ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదని.. డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ ఈసీని ఆదేశించింది హైకోర్టు.