
- ఆల్ట్రాసౌండ్, రేడియో ఫ్రీక్వెన్సీ మెషీన్లతో ట్రీట్మెంట్
పద్మారావునగర్, వెలుగు: దీర్ఘకాలంగా బాధిస్తున్న నొప్పులకు చికిత్స నిర్వహించి త్వరగా ఉపశమనం కల్పించే అత్యాధునిక వైద్య పద్ధతులు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ప్రారంభమయ్యాయి. గాంధీ అనస్తీషియా విభాగం ఆధ్వర్యంలో ఇటీవల ఏర్పాటు చేసిన పెయిన్ క్లినిక్లో శుక్రవారం ముగ్గురు రోగులకు ఇంటర్వెన్షన్ ప్రొసీడర్స్ ద్వారా ట్రీట్మెంట్ అందించినట్లు గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ సీహెచ్ఎన్ రాజకుమారి, అనస్తీషియా హెచ్ఓడీ ప్రొఫెసర్ ఆవుల మురళీధర్ తెలిపారు. అడ్వాన్స్డ్ వైద్య యంత్రాలైన ఆల్ట్రాసౌండ్, రేడియోఫ్రీక్వెన్సీ మెషీన్ల ద్వారా వైద్యసేవలు అందించగా బాధితులు కోలుకుంటున్నారని వివరించారు.
ఒకరు తీవ్రమైన భుజం నొప్పి(ప్రొజన్ షోల్డర్), మరో ఇద్దరు కీళ్ల నొప్పులు ( క్రానిక్ నీ ఆర్థరైటీస్)తో కొన్నేళ్లుగా బాధపడుతున్నారని, గాంధీ పెయిన్ క్లినిక్కు రాగా ఇంటర్వెన్షన్ ప్రొసీడర్స్ ద్వారా చికిత్స అందించామని చెప్పారు. ఈ వైద్యవిధానంలో కేవలం ఇంజక్షన్లు మాత్రమే వినియోగిస్తామని, ఆపరేషన్లు ఉండవని వివరించారు. దీర్ఘకాల, మొండి నొప్పులకు ఈ వైద్య విధానం ఎంతో ఉపయుక్తమన్నారు. ఈ రకమైన చికిత్సలకు ప్రైవేటు, కార్పోరేట్ ఆస్పత్రుల్లో వేలాది రూపాయలు వసూలు చేస్తారని, గాంధీ ఆస్పత్రిలో ఉచితంగా నిర్వహించామని తెలిపారు. గాంధీ ఓపీ విభాగంలో సోమవారం నుంచి శనివారం వరకు పెయిన్ క్లినిక్ అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో అనస్తీషియా డాక్టర్లు, మెడికల్ స్టూడెంట్లు పాల్గొన్నారు.