గండిపేట, వెలుగు: రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ కృషి నిలయంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. హాస్టల్లో భోజనం చేసిన సుమారు 40 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వెంటనే వారిని చికిత్స కోసం దవాఖానకు పంపినట్లు తెలిసింది. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కొంత మంది విద్యార్థులు యూనివర్సిటీ వీసీ జానయ్యకు వినతిపత్రం అందజేశారు.
అవాస్తవం: వార్డెన్
ఫుడ్ పాయిజన్ జరిగిందన్న వార్తల్లో వాస్తవం లేదని చీఫ్ వార్డెన్ డాక్టర్ ఎం.గోవర్ధన్ తెలిపారు. శనివారం బి- హాస్టల్ డే నిర్వహించగా, కొంతమంది విద్యార్థులు ఆలస్యంగా తినడం వల్ల అజీర్తి అయిందని స్పష్టం చేశారు. వెంటనే వారికి చికిత్స అందించామని, సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఫుడ్ పాయిజన్ వంటి పుకార్లను నమ్మవద్దన్నారు.
