ఇబ్రహీంపట్నం, వెలుగు: బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొని యూరియా కోసం వచ్చిన రైతు చనిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలకేంద్రంలో సాగర్ రోడ్డుపై బైక్ ను దేవరకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంచాల మండలం వెంకటేశ్వర తండా గ్రామానికి చెందిన జాటావత్ హరియా(47) తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించే లోపే చనిపోయాడు.
యూరియా కోసం వచ్చి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు సాగర్ రోడ్డుపై డెడ్బాడీతో ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సాగర్ రోడ్డుపై కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఈ మేరకు యాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
