చేవెళ్ల, వెలుగు: తాళం వేసిన ఇండ్లు, షట్టర్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న పార్దీ గ్యాంగ్ లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం మొయినాబాద్ పీఎస్లో డీసీపీ యోగేశ్ గౌతమ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 11న శంకర్పల్లి మండలం ఎల్వర్తి గ్రామంలోని ఓ ఇంటి తాళాలు పగులగొట్టి అల్మారాలోని బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు ఎత్తుకెళ్లారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు ఆదివారం మహారాష్ట్రకు చెందిన పార్దీ గ్యాంగ్కు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎల్వర్తితో పాటు ఆరు నెలలుగా శంకర్పల్లి, బీడీఎల్ భానూర్, గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో 11 చోరీలు చేసినట్లు ఒప్పుకున్నారు. వారి నుంచి రూ.5 వేల నగదు, అర తులం బంగారం, చోరీకి ఉపయోగించిన రాడ్ ను స్వాధీనం చేసుకున్నారు.
సోలాపూర్కు చెందిన విశాల్ భగవత్ షిండే(19), జాల్నా జిల్లాకు చెందిన కృష్ణ దండేకర్(19) పట్టుబడగా.. శివాజీ భోంస్లే, రాహుల్ విజయ్ పవార్, అతని మామ, జమున పరారీలో ఉన్నారు. వీరి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. మహారాష్ట్రలోని సోలాపూర్, జాల్నా జిల్లాలకు చెందిన ఆరుగురితో కూడిన ఈ గ్యాంగ్ శంకర్ పల్లి, లింగంపల్లి, టోలిచౌకీ ప్రాంతాల్లో ఉంటూ, పగలు రెక్కీ నిర్వహించి రాత్రి దొంగతనానికి వెళ్తారని తెలిపారు.
