రెగ్యులరైజేషన్ అయ్యేనా?

రెగ్యులరైజేషన్ అయ్యేనా?
  •     వెరిఫికేషన్​ కంప్లీట్​ అయినవీ పెండింగ్​లోనే... 
  •     రూల్స్​ ప్రకారం ఉన్నా కొర్రీలు పెడుతున్న ఆఫీసర్లు 
  •     ఎలక్షన్​ కోడ్​వస్తే క్రమబద్దీకరణ కష్టమని ఆందోళన  

మంచిర్యాల, వెలుగు: జిల్లాలో ప్రభుత్వ భూముల రెగ్యులరైజేషన్​ ప్రక్రియ నత్తనడక సాగుతోంది. ఓవైపు ఫీల్డ్​ వెరిఫికేషన్​ ఆలస్యమవుతుండగా, మరోవైపు వెరిఫికేషన్​ పూర్తయిన దరఖాస్తులు సైతం పెండింగ్​లో ఉంటున్నాయి. అన్నీ రూల్స్​ ప్రకారం ఉన్నప్పటికీ కొందరు అధికారులు కావాలనే కొర్రీలు పెడుతూ అప్లికేషన్లను రిజెక్ట్​ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్టోబర్​లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ ప్రకటించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. షెడ్యూల్​ రిలీజ్​ అయితే వెంటనే ఎలక్షన్​ కోడ్​ అమల్లోకి వచ్చి ఎక్కడి పనులు అక్కడే ఆగిపోనున్నాయి. ఈలోగా రెగ్యులరైజేషన్​ ప్రక్రియ కంప్లీట్​ కాకుంటే ఎలక్షన్స్​ అయ్యే వరకు ఎదురుచూపులు తప్పవని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. 

7వేలకు పైగా అప్లికేషన్లు 

ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వారికి ఇండ్లతో పాటు చుట్టూ ఉన్న ఖాళీ జాగలను రెగ్యులరైజేషన్​ చేసేందుకు ప్రభుత్వం 58, 59 జీవోలను తీసుకొచ్చింది. జీవో 58 కింద 120 గజాల లోపు స్థలాలను ఉచితంగా క్రమబద్దీకరించనుంది. జీవో 59 ద్వారా 120 గజాల కంటే ఎక్కువ జాగలను స్లాబ్​లుగా విభజించింది. వాటికి మార్కెట్​ రేటులో 25 పర్సెంట్​ నుంచి 100 పర్సెంట్​వరకు రేట్లు నిర్ణయించింది. మొదట్లో 2014 జూన్​ 2 కటాఫ్​ డేట్ పెట్టిన సర్కారు మరింత మందికి లబ్ది చేకూర్చాలనే ఉద్దేశంతో దానిని 2020 జనవరికి వరకు పొడిగించింది. జిల్లాలో జీవో 58 కింద ఈ ఏడాది 1,394 దరఖాస్తులు వచ్చాయి. జీవో 59 కింద 2023లో 2,820, 2022లో 2,028, మొత్తం 7,042 అప్లికేషన్లు అందాయి.  

స్లోగా సర్వే..  

58, 59 జీవోల కింద వచ్చిన దరఖాస్తులపై ఫీల్డ్​ వెరిఫికేషన్​ కోసం జిల్లాలో స్పెషల్​ టీమ్​లను ఏర్పాటు చేశారు. జీవో 58 కింద 1,394 అప్లికేషన్లు రాగా, 1,376 వెరిఫికేషన్​ పూర్తయింది. 18 పెండింగ్​ ఉన్నాయి. అలాగే జీవో 59 కింద ఈ ఏడాది వచ్చిన 2,820 దరఖాస్తుల్లో 2783 వెరిఫికేషన్​ చేయగా, మరో 37 మిగిలాయి. 2022లో 2828 అప్లికేషన్లకు గాను 1,396 మాత్రమే సర్వే చేశారు. ఇంకా 1,432 దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నాయి. జీవో 59 సర్వే కోసం జిల్లాలో తొమ్మిది టీమ్​లను నియమించారు. ఒక్కో టీమ్​కు జిల్లా స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించారు. వారికి సహాయకులుగా రెవెన్యూ, సర్వే డిపార్ట్​మెంట్ల సిబ్బందిని నియమించారు. అయితే అధికారులకు ఓవైపు పని ఒత్తిడి, మరోవైపు నిర్లక్ష్యం వల్ల సర్వేలో ఆలస్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది.  

కొర్రీలు పెడుతూ.. 

ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ విషయంలో కొందరు అధికారులు దరఖాస్తుదారులను ఇబ్బందిపడుతున్నట్లు తెలుస్తోంది. అన్నీ రూల్స్​ ప్రకారం ఉన్నప్పటికీ లేనిపోని కారణాలతో కొర్రీలు పెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ల్యాండ్​ అండ్​ సర్వే డిపార్ట్​మెంట్​అధికారుల టీమ్​ మాత్రమే కరెక్ట్​గా సర్వే చేస్తోందని, మిగిలిన టీమ్​లు తప్పులతడకగా వెరిఫికేషన్​ చేస్తున్నాయంటూ పై ఆఫీసర్లను తప్పుదోవ పట్టిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెరిఫికేషన్​ అయిన వాటిలోనూ కలెక్టర్​కు రెకమండ్ ​చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు జీవో 58 కింద 614, జీవో 59 కింద ఈ ఏడాది వచ్చిన దరఖాస్తుల్లో 897, గతేడాది అప్లికేషన్లలో 357 రెకమండ్​ చేశారు. ఇందులో కేవలం నస్పూర్​కు సంబంధించిన 41 దరఖాస్తులను మాత్రమే అప్రూవల్​ చేశారు. 

నస్పూర్​లో తక్కువ... బెల్లంపల్లిలో ఎక్కువ..... 

జీవో 59 కింద స్లాబ్​ల వారీగా భూముల రేట్ల నిర్ధారణలో సైతం లోపాలున్నట్టు తెలుస్తోంది. నస్పూర్​ మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం మార్కెట్​ రేటు గజానికి రూ.10 వేల పైన ఉంది. ఇక్కడ గవర్నమెంట్​ రేటు కేవలం రూ.1500 నుంచి రూ.2వేల లోపు నిర్ధారించారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలోని కొన్ని ఏరియాల్లో మార్కెట్​ రేటు కంటే గవర్నమెంట్​ రేటు ఎక్కువగా నిర్ధారించడం గమనార్హం. ఇక్కడ కొన్ని చోట్ల గజానికి ఏకంగా రూ.6వేలకు పైగా నిర్ధారించారు. దీంతో రూ.లక్షల్లో రెగ్యులరైజేషన్​ ఫీజు చెల్లించలేకపోతున్నారు. ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడంతో పాటు ఖజానా నింపుకోవడానికి ఈ స్కీమ్​ను తీసుకొచ్చినప్పటికీ అధికారుల తీరుతో ఆ లక్ష్యం నెరవేరడం లేదని విమర్శలు వస్తున్నాయి.