
- పైలట్ ప్రాజెక్టుగా పోలీసు శాఖ, ఆర్టీసీ భూముల సంరక్షణకు చర్యలు: చిన్నారెడ్డి
- దశల వారీగా ఎండోమెంట్, వక్ఫ్, ఇతర శాఖల భూములకు వర్తింపు
- భూములు కబ్జాకు గురికాకుండా కాపాడేందుకేనని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల భూములు, స్థిరాస్తులను జియో రెఫరెన్సింగ్ మ్యాపింగ్ ద్వారా సంరక్షించనున్నట్టు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డి తెలిపారు. ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా కాపాడేందుకే దీనిని తీసుకొస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టుగా పోలీసు శాఖ, ఆర్టీసీ భూములు, ఇతర స్థిరాస్తుల సంరక్షణ చేపట్టనున్నట్టు తెలిపారు. శనివారం ఖైరతాబాద్ లోని తెలంగాణ రిమోట్ ఏజెన్సీ సెంటర్ (టీజీ రాక్)లో సంస్థ కార్యక్రమాలపై ఉన్నతాధికారులతో చిన్నారెడ్డి సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జియో రిఫరెన్సింగ్లో సరిహద్దులను పక్కాగా ఇస్తారని, రాబోయే రోజుల్లో ఎండోమెంట్, వక్ఫ్, ఇతర శాఖల భూముల సంరక్షణకు ఇదే విధానాన్ని కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ భూముల జోలికి ఎవరైనా వస్తే కఠిన చర్యలు తప్పవని చిన్నారెడ్డి హెచ్చరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో స్థిరాస్తుల వివరాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని, ప్రైవేట్ సంస్థలకు ఈ బాధ్యత అప్పగించవద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి సూచించారు.
అటవీ శాఖలో మొక్కల సంరక్షణకు వినియోగించే జియో ట్రాకింగ్ బాధ్యతలను ప్రభుత్వ రిమోట్ సెన్సింగ్ సెంటర్ కు అప్పగించాలని, ఈ విషయాన్ని పీసీసీఎఫ్ డోబ్రియాల్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఆయన తెలిపారు. హైదరాబాద్ సిటీ చుట్టూ ఉన్న 920 చెరువులలో దాదాపు 240 చెరువులు ఆక్రమణకుగురయ్యాయని, ఇలాంటి పరిస్థితులు రాకుండా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను తీసుకొచ్చారని చిన్నారెడ్డి గుర్తుచేశారు.
సాగు లెక్కలకు కూడా..
రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం ప్రతి ఏటా పెరుగుతోందని, దీనిపై పలు అనుమానాలు ఉన్నాయని చిన్నారెడ్డి అన్నారు. ఈ అనుమానాలను నివృత్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో జియో రెఫరెన్సింగ్ విధానాన్ని ఉపయోగించి పక్కా సాగు లెక్కలు సేకరించాలని చిన్నారెడ్డి అధికారులకు సూచించారు. రాబోయే రోజుల్లో రైతుల నుంచే తనకున్న భూమిలో ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారని స్వీయ నివేదిక తీసుకోనున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో రిమోట్ సెన్సింగ్ అదనపు డైరెక్టర్ జనరల్ మనోహర్, అర్థ గణాంక శాఖ డైరెక్టర్ రుఫస్ దత్తం, పరిపాలన అధికారి రాజోజు నరసింహా చారి, జేడీ శివ ప్రసాద్, సైంటిస్టులు పాల్గొన్నారు.