బ్రెయిన్​డెడ్ ​అయిన తేజశ్రీ మృతి.. అవయవదానం వీలుకాలే

బ్రెయిన్​డెడ్ ​అయిన తేజశ్రీ మృతి.. అవయవదానం వీలుకాలే
  • అవయవదానానికి హైదరాబాద్​తీసుకెళ్లగా అప్పటికే మృతి 
  • నిజామాబాద్ ​జీజీహెచ్ ​హాస్పిటల్​లో పోస్టుమార్టం 
  • భారీ పోలీస్​ బందోబస్తు మధ్య అంత్యక్రియలు 
  • నిందితుడిని శిక్షించాలని ఎమ్మార్పీఎస్​ రాస్తారోకో 

నిజామాబాద్, వెలుగు: ప్రేమోన్మాది పాశవిక దాడిలో బ్రెయిన్​డెడ్​ అయిన ఘనపురం తేజశ్రీ చనిపోయింది. ఆమె అవయవాలు దానం చేయడానికి పేరెంట్స్​హైదరాబాద్​ తీసుకెళ్లగా అప్పటికే కన్నుమూసినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. దీంతో పోలీసులు శుక్రవారం ఉదయం నిజామాబాద్ ​జీజీహెచ్​హాస్పిటల్​కు తేజశ్రీ డెడ్​బాడీ తీసుకొచ్చారు. పోస్టుమార్టం తర్వాత శవాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. భారీ పోలీస్​బందోబస్తు మధ్య సాయంత్రం జక్రాన్​పల్లిలో అంత్యక్రియలు ముగిశాయి. నిందితుడిని ఉరితీయాలని ఎమ్మార్పీఎస్​నేతల ఆధ్వర్యంలో గ్రామంలోని మెయిన్​రోడ్డుపై గ్రామస్తులు రాస్తారోకో చేశారు. 

అవయవదానం వీలుకాలే..

23వ తేదీ రాత్రి జక్రాన్​పల్లిలో ఉన్మాది దాడిలో తేజశ్రీకి తీవ్ర గాయాలయ్యాయి. 25వ తేదీన నిజామాబాద్​గవర్నమెంట్​హాస్పిటల్​లో చేర్పించాకే విషయం బయటకు వచ్చింది. వెంటిలేటర్​పై ట్రీట్​మెంట్​అందించిన డాక్టర్లు ఆమె బతకడం కష్టమని తేల్చేశారు. జీజీహెచ్​లో చేరిన రోజే ఆమె మరణించిందని, కోమాలోనే ఉందని రెండురకాల ప్రచారాలు జరిగాయి. అల్లర్లు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. 

గణేశ్​నిమజ్జన వేడుకలు ఉన్నందున వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అయితే తేజశ్రీ కోలుకునే ఛాన్స్​లేదని డాక్టర్లు ఆమె అవయవదానానికి తల్లిదండ్రులను ఒప్పించారు. 27వ తేదీ రాత్రి నిజామాబాద్​ నుంచి అంబులెన్స్​లో హైదరాబాద్​నిమ్స్​కు తరలించారు. అక్కడ అవయవాల సేకరణకు 28న రాత్రి సిద్ధం కాగా అప్పటికే ఆమె చనిపోయినట్లు గుర్తించి వెనక్కి పంపారు. 

భారీగా పోలీసుల మోహరింపు

తేజశ్రీ డెడ్​బాడీకి జీజీహెచ్​లో పోస్టుమార్టం జరుగుతున్నప్పుడు హాస్పిటల్​ఆవరణలో పోలీసులను మోహరించారు. శవాన్ని సాయంత్రం అంబులెన్సులో జక్రాన్​పల్లికి ఎస్కార్ట్​తో పంపారు. అప్పటికే మెయిన్​రోడ్డుపై ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో గ్రామస్తులు రాస్తారోకో చేశారు. హంతకుడిని ఉరి తీయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్​చేశారు. పోలీస్​ కమిషనర్​సత్యనారాయణ ఆందోళనకారులతో మాట్లాడి శాంతపరిచారు. 

తేజశ్రీ శవం గ్రామానికి చేరుకున్నాక భారీ ర్యాలీతో ఆమెకు అంతిమ సంస్కారాలు చేశారు. గ్రామస్తులంతా ఇందులో పాల్గొన్నారు. అంత్యక్రియలు ముగిసేదాకా పోలీసులు అక్కడే ఉన్నారు. 

దాడికి ముందు లైంగికదాడి?

తేజశ్రీపై దాడికి ముందు లైంగికదాడి జరిగినట్లు డాక్టర్లు అనుమానిస్తున్నారు. ఆమె వేసుకున్న దుస్తులపై మరకలు ఉండడం ఇందుకు కారణంగా భావిస్తున్నారు. నిర్ధారణకు శాంపిల్​ను ఫొరెన్సిక్​ ల్యాబ్​కు పంపించామని, నివేదిక వస్తేగానీ ఏ విషయం చెప్పలేమని హాస్పిటల్​సూపరింటెండెంట్​ డాక్టర్​ ప్రతిమారాజ్​ తెలియ జేశారు.