హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎట్టకేలకు క్యూర్ పరిధిలో కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్(సీఆర్ఎంసీ) ఫేజ్-2 కింద రోడ్ల నిర్వహణ టెండర్లను జీహెచ్ఎంసీ ఆహ్వానించింది. రూ.3145 కోట్లతో జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ పరిధిలో బీటీ, సీసీ రోడ్లను మెయింటెనెన్స్ కి అప్పగించనున్నారు. గతంలో ఫేజ్–1 కింద అప్పగించిన రోడ్లతో పాటు మరిన్ని రోడ్లను కలిపి 10 ఏండ్ల పాటు నిర్వహణకు ఇవ్వనున్నారు.
బుధవారం నుంచి ఈ నెల 19 వరకు టెండర్లకు సంబంధించిన బిడ్లను స్వీకరించనున్నారు. తర్వాత టెండర్లను ఓపెన్ చేసి అర్హత ఉన్న సంస్థకు బాధ్యతలను అప్పగిస్తారు. ఇప్పటికే నగరంలో చాలా రోడ్లు దెబ్బతిన్నాయి. ఇటీవల కురిసిన వానలకు మరింత డ్యామేజ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. టెండర్లు త్వరగా పూర్తయితే రోడ్ల సమస్య తీరే అవకాశం ఉంది.
జీహెచ్ఎంసీకే ఎక్కువ...
రూ.3145 కోట్లతో 1045 కిలోమీటర్ల మేర రోడ్లను మెయింటెనెన్స్ కింద అప్పగించనుండగా, ఇందులో అత్యధిక రోడ్లు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండడంతో రూ.1533 కోట్లు కేటాయించారు. అలాగే, ఎంఎంసీకి రూ.818 కోట్లు, సీఎంసీలకు రూ.794 కోట్ల చొప్పున కేటాయింపులు చేశారు. ఫస్ట్ ఫేజ్ లో ఐదేండ్ల పాటు నిర్వహణ బాధ్యతలు ఉండగా, రెండో దశలో దీనిని 10 సంవత్సరాలకు పొడిగించారు. ఈ ప్రాజెక్టులో ఫేజ్–1 కింద గతంలో ఉన్న 744.22 కిలోమీటర్ల బీటీ, సీసీ రోడ్ల నిర్వహణకు రూ.1050 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.2,230 కోట్లు ఇచ్చారు. వీటికితోడు అదనంగా 64.49 కిలోమీటర్ల సీసీ రోడ్లకి రూ.208 కోట్లు, మరో 236.30 కిలోమీటర్ల బీటీ రోడ్లను ఫుల్ డెప్త్ రిక్లమేషన్ (ఎఫ్ డీఆర్) సాంకేతికతతో అభివృద్ధి చేయడానికి రూ.707 కోట్లు కేటాయించారు.
చేయాల్సిన పనులు ఇవే..
టెండర్లు దక్కించుకునే ఏజెన్సీలు రోడ్లపై గుంతలు పడకుండా ఎప్పటికప్పుడు రిపేర్లు చేయడం, రోడ్లపై చెత్తను తొలగించడానికి మెకానికల్ స్వీపింగ్ యంత్రాలు ఉపయోగించడం, ట్రాఫిక్ భద్రత కోసం లేన్ మార్కింగ్లు వేయడం, సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం, ఫుట్పాత్లు, సెంట్రల్ మీడియన్లను మెయింటెయిన్చేయాల్సి ఉంటుంది. నిర్వహణలో లోపాలుంటే ఏజెన్సీలకు జరిమానాలు విధించే అధికారం కూడా ఆయా మున్సిపల్ కార్పొరేషన్లకు ఉంటుంది.
