
హైదరాబాద్ వనస్థలిపురంలోని ఓ ప్రైవేట్ క్లినిక్ లో దారుణం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో పోచంపల్లి భీమనపల్లికి చెందిన 11 ఏళ్ల బాలిక మృతి చెందింది. రెండు రోజుల క్రితం గొంతులో 10 రూపాయల నాణెం ఇరుక్కుందని కుటుంబ సభ్యులు బాలికను హాస్పత్రికి తీసుకొచ్చారు. బాలిక గొంతులో నుంచి నాణెం బయటికి తీసి ఇంటికి పంపించారు వైద్యులు.
ఒకరోజు తరువాత బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో మళ్లీ ఆస్పత్రికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు . వైద్యం చేస్తుండగా సెప్టెంబర్ 20న బాలిక మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. హాస్పిటల్ నిర్లక్ష్యంతోనే బాలిక మృతి చెందిందని బంధువులు ఆందోళనకు దిగారు.
ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నపాటి నర్సింగ్ క్లినిక్ అనుమతులతో క్లినిక్ నిర్వాహకులు ఆపరేషన్ లు చేస్తున్నారని ఆరోపించారు. బాలిక మృతికి కారణమైన క్లినికల్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.