- 2024-25 లో 17-19 శాతం వృద్ధి
- అంచనా వేసిన క్రిసిల్ రేటింగ్స్
న్యూఢిల్లీ : నగల వ్యాపారుల (గోల్డ్ జ్యువెలర్లు) రెవెన్యూ ఈ ఏడాది మరింత పెరుగుతుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. గోల్డ్ జ్యువెలరీ రిటైలర్ల (ఆర్గనైజ్డ్ సెక్టార్) రెవెన్యూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17–19 శాతం వృద్ధి చెందుతుందని పేర్కొంది. వాల్యూమ్ పరంగా గ్రోత్ ఉండకపోయినప్పటికీ, గోల్డ్ ధరలు పెరగడంతో రెవెన్యూ వృద్ధి చెందుతుందని అంచనా వేస్తోంది. గోల్డ్ ధరలు భారీగా పెరగడం, కొత్త స్టోర్లను ఏర్పాటు చేస్తుండడంతో జ్యువెలరీ రిటైలర్ల వర్కింగ్ క్యాపిటల్ ఖర్చులు కూడా పెరుగుతాయని తెలిపింది.
కాగా, దేశంలో బంగారు నగలు అమ్ముతున్నవారిలో ఆర్గనైజ్డ్ సెక్టార్ వాటా మూడో వంతు మాత్రమే ఉంది. మెజార్టీ వాటా అనార్గనైజ్డ్ సెక్టార్ కంట్రోల్లో ఉంది. క్రిసిల్ రేటింగ్స్ రిపోర్ట్ ప్రకారం, ఇండియాలో బంగారం ధర 2023–24 లో 10 గ్రాములకు రూ.67 వేలకు చేరుకుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 15 శాతం పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్లో 10 గ్రాముల బంగారం రేటు రూ.73 వేలను టచ్ చేసింది. మిడిల్ ఈస్ట్లో ముదురుతున్న టెన్షన్ల కారణంగా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంక్లు గోల్డ్ కొనుగోలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి.
ఫలితంగా వీటి రేట్లు చుక్కలనంటుతున్నాయి. కన్జూమర్ల నుంచి కూడా డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టాన్ని టచ్ చేశాయి. ‘బ్రాండింగ్, మార్కెటింగ్ ఖర్చులు పెంచడంతో పాటు కస్టమర్లకు మరిన్ని డిస్కౌంట్లను రిటైలర్లు ఇవ్వొచ్చు. గోల్డ్ ధరలు భారీగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో వీరు కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త డిజైన్లు, ప్రొడక్ట్లతో మార్కెట్లోకి రావొచ్చు. తక్కువ క్యారెట్ ఉన్న గోల్డ్ నగలకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. అలానే జ్యువెలర్లు గోల్డ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్లను భారీగా ప్రమోట్ చేస్తాయని భావిస్తున్నాం’ అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ ఆదిత్య జావెర్ అన్నారు. ఫలితంగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్లతో జ్యువెలరీల సేల్స్ ఊపందుకుంటాయని అంచనా వేశారు.
కొత్త స్టోర్లు ఓపెన్ చేస్తున్న పెద్ద కంపెనీలు
తనిష్క్, మలబార్ జ్యువెలర్స్ వంటి ఆర్గనైజ్డ్ జ్యువెలరీ రిటైలర్ల మార్కెట్ షేర్ పెరుగుతుందని, అనార్గనైజ్డ్ సెక్టార్ వాటా తగ్గుతుందని క్రిసిల్ రేటింగ్ పేర్కొంది. పెద్ద జ్యువెలరీ కంపెనీలు టైర్ 1, టైర్ 2 సిటీలలో స్టోర్లను ఓపెన్ చేస్తున్నాయని, కన్జూమర్ల అలవాటులో మార్పు కనిపిస్తోందని వెల్లడించింది. పెద్ద జ్యువెలరీ రిటైలర్లు భారీగా స్టోర్లను ఓపెన్ చేస్తున్నాయని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త స్టోర్ల ఓపెనింగ్లో10–12 శాతం గ్రోత్ కనిపిస్తుందని అంచనా వేసింది. మరోవైపు గోల్డ్ ధరలు ఎక్కువవ్వడంతో జ్యువెలరీలు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుందని, వీరి ఇన్వెంటరీ ఖర్చులు భారీగా పెరుగుతాయని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది.