ఇది సీఎం కుట్రే.. అర్థరాత్రి గవర్నర్ కాన్వాయ్ పై విద్యార్థుల దాడి

ఇది సీఎం కుట్రే.. అర్థరాత్రి గవర్నర్ కాన్వాయ్ పై విద్యార్థుల దాడి

తన వాహనంపై జరిగిన దాడిపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ ఖాన్‌ ఘాటుగా స్పందించారు. తనపై భౌతిక దాడి చేయించేందుకు ముఖ్యమంత్రి విజయన్‌ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. డిసెంబర్ 11న రాత్రి ఆయన ఢిల్లీ పర్యటన నిమిత్తం తిరువనంతపురం విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆగ్రహంతో కారు దిగిపోయిన గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ.. కేరళ సీఎం పినరయి విజయన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తన వాహనంపై కొందరు ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు దాడి చేశారని మండిపడ్డారు. ఇది సీఎం చేయించిన పనేనని, వీరిని ఆయనే పంపారన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం కుప్పకూలిపోతున్నట్లు కనిపిస్తోందని ఈ సందర్భంగా గవర్నర్ వ్యాఖ్యానించారు.

మరోవైపు గవర్నర్‌ వాహనాన్ని ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు ఒకే చోట అడ్డుకున్నారని, విద్యార్థి సంఘానికి చెందిన ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో రెండు ఘటనల్లో నల్లజెండాలు మాత్రమే కనిపించగా.. అందుకు సంబంధించి దాదాపు 10-12 మంది ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఐపీసీలోని సంబంధిత నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు. చాలాకాలంగా గవర్నర్, కేరళ సీఎంల మధ్య వివాదం కొనసాగుతోంది. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో వీరి మధ్య దూరం మరింత పెరిగింది.

కన్నూర్‌ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్‌‌గా గోపీనాథ్‌ రవీంద్రన్‌ పునర్నియామకాన్ని సుప్రీంకోర్టు ఇటీవలే కొట్టివేసింది. ఈ విషయంలో కేరళ సర్కారు జోక్యాన్ని, రవీంద్రన్‌ను తిరిగి నియమిస్తూ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ఖాన్‌ ఇచ్చిన ఉత్తర్వులను తప్పుబట్టింది. కోర్టు తీర్పుపై గవర్నర్‌ ఆరిఫ్‌ ఖాన్‌ స్పందిస్తూ.. రవీంద్రన్‌ను వీసీగా నియమించాలంటూ సీఎం పినరయి విజయన్‌ తనపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపించారు. ఇందులో ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్‌.బిందును తప్పుపట్టడానికి కారణం లేదని వ్యాఖ్యానించారు.

దీనికి కౌంటర్‌గా గవర్నర్‌ ఆరిఫ్‌ తన విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ సీఎం విజయన్‌ ఆరోపించడంతో వివాదం మరింత ముదిరింది. గవర్నర్‌గా ఆయన తన విధులు నిర్వర్తిస్తే చాలని, ఆయన ఏదైనా చెప్పాలి అనుకుంటే నేరుగా తనకు చెప్పాలని సీఎం వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ తాజాగా చేసిన ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు, తాము చేపట్టిన నవ కేరళ సదాస్ ర్యాలీపై సీపీఎం, డీవైఎఫ్ఐ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది.