
- గచ్చిబౌలిలో 1,260 బెడ్లతో హాస్పిటల్..
- 50 బెడ్ల ఐసీయూ, వెంటిలేటర్లూ ఏర్పాటు
- ఇప్పటివరకు డాక్టర్లు, స్టాఫ్ లేరు.. పేషెంట్లు లేరు
- ముందు కరోనా హాస్పిటల్ అన్నరు.. తర్వాత టిమ్స్గా మార్పు
- 11 మంది డాక్టర్లు, కొందరు స్టాఫ్ డిప్యుటేషన్
- వారం రోజులు నడిచిన ఓపీ.. 47 మంది పేషెంట్లకే ట్రీట్మెంట్
- తర్వాత ఉన్న స్టాఫ్ అంతా ఉస్మానియా హాస్పిటల్కు షిఫ్ట్
- కరోనా చెయ్యిదాటడంతో ఉరుకులు పరుగులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా కేసులు మొదలైన కొత్తలోనే ప్రత్యేకంగా ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ ఏర్పాటు చేస్తమని సర్కారు ప్రకటించింది. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ బిల్డింగ్ను తీసుకుని ఏర్పాట్లు చేసింది. తర్వాత దాన్నే టిమ్స్గా మారుస్తమని చెప్పింది. తర్వాత పట్టించుకునుడు బంజేసింది. కాంట్రాక్టు రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇచ్చినా డాక్టర్లు, నర్సులు, ఇతర పోస్టులను భర్తీ చెయ్యలేదు. డిప్యుటేషన్మీద తెచ్చిన కొందరు డాక్టర్లు, స్టాఫ్ తిరిగి ఉస్మానియాకు వెళ్లాల్సి వచ్చింది. అంత పెద్ద హాస్పిటల్లో ఒకరిద్దరు స్టాఫ్ వచ్చి, తాళాలు తీసుకుని ఖాళీగా కూర్చుంటున్న పరిస్థితి. కొద్దిరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతుండటం, సర్కారీ దవాఖాన్లలో బెడ్లు సరిపోని పరిస్థితి రావడంతో సర్కారు ఇప్పుడు హడావుడి మొదలుపెట్టింది.
మన దగ్గర కరోనా ఎఫెక్ట్ ఉండదంటూ తొలుత పెద్దగా పట్టించుకోని సర్కారు.. కేసులు మొదలవడంతోనే హడావుడి మొదలుపెట్టింది. గాంధీని కరోనా హాస్పిటల్గా ప్రకటించింది. ఇంకా కేసులు పెరుగుతుండటంతో గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ అథారిటీకి చెందిన 13 ఫ్లోర్ల బిల్డింగ్ను తీసుకుని, కరోనా స్పెషల్ హాస్పిటల్గా తీర్చిదిద్దుతామని చెప్పింది. మంత్రులు కొద్దిరోజుల పాటు రోజూ వెళ్లి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. తర్వాత మర్చిపోయారు. మధ్యలో కొన్నిరోజులు టెస్టులు, కేసుల సంఖ్య తగ్గడంతో దాని జోలికే వెళ్లలేదు. కానీ కొన్ని బెడ్లు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి ఉండటంతో ట్రీట్మెంట్ మొదలుపెట్టాలని జనం నుంచి డిమాండ్ వచ్చింది. దాంతో ఏప్రిల్ 19న సీఎం కేసీఆర్ ఈ హాస్పిటల్ ను టిమ్స్ (తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)గా అనౌన్స్ చేశారు. వెంటనే పని చేయడం ప్రారంభిస్తుందన్నారు. కానీ డాక్టర్లు, ఇతర స్టాఫ్ నియామకం జరగలేదు. కొందరు డాక్టర్లను డిప్యుటేషన్పై పంపి నామమాత్రంగా హాస్పిటల్ ను ఓపెన్ చేశారు. వారం రోజుల్లో 47 మంది పేషెంట్లు ఓపీకి వచ్చారు. ఈలోపు ఉస్మానియా హాస్పిటల్లో పని ఒత్తిడి, ఇతర కారణాలతో పీజీ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో.. గచ్చిబౌలిలోని స్టాఫ్ అందరినీ తిరిగి ఉస్మానియాకు పంపారు. టిమ్స్ ఎప్పట్లాగే ఒకరిద్దరితో నామమాత్రంగా మారిపోయింది.
ఏర్పాట్లు బాగానే చేసినా..
13 ఫోర్ల ఈ బిల్డింగ్లో 1,260 బెడ్లు ఏర్పాటు చేసింది. మొత్తం 468 రూములున్నాయి. 50 బెడ్లతో ఐసీయూ, 14 వెంటిలేటర్లను ఏర్పాటు చేసింది. ఇంతా చేసి స్టాఫ్ రిక్రూట్మెంట్ ను మాత్రం పట్టించుకోలేదు. ప్రారంభమై రెండు నెలలవుతున్నా ఒక్క పేషెంట్ ను కూడా చేర్చుకుని ట్రీట్మెంట్ చేయలేదు. టిమ్స్ను ప్రకటించిన తొలి రోజుల్లో 153 డాక్టర్లు, 228 నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, శానిటైజేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ తదితర సర్వీసుల కోసం మరో 578 మందిని అపాయింట్ చేస్తామని సర్కారు చెప్పింది. కానీ జరగలేదు. తర్వాత 153 మందిని డిప్యుటేషన్పై పంపామని చెప్పింది. కానీ హాస్పిటల్కు వెళ్లి చూస్తే 11 మంది డాక్టర్లు, 53 మంది నర్సులు, నలుగురైదుగురు ల్యాబ్ టెక్నీషియన్లు, కొందరు సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ఉన్నట్టు తెలిసింది. వాళ్లు కూడా వారం కింద ఉస్మానియాకు వెళ్లిపోయారు.
ఓపెనింగ్ లేదు.. వర్కింగ్ లేదు..
నిజానికి గచ్చిబౌలి హాస్పిటల్కు ఇప్పటివరకు అఫీషియల్గా ఓపెనింగ్ జరగలేదు. కరోనా పేషెంట్ల సంఖ్య పెరిగితే ట్రీట్మెంట్ ప్రారంభిస్తామని మొదట్లో చెప్పి, ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 6న కరోనా హాస్పిటల్ను ప్రారంభిస్తామని అంతకు రెండు రోజుల ముందు హెల్త్ మినిస్టర్ ఈటల ప్రకటించారు. కానీ కాలేదు. ఏప్రిల్19న జరిగిన ప్రెస్మీట్లో గచ్చిబౌలి హాస్పిటల్ను టిమ్స్గా మారుస్తామని సీఎం ప్రకటించారు. తర్వాతి రోజు నుంచే సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. దాంతో ఎవరూ ప్రారంభించకుండానే టిమ్స్ పనులు మొదలయ్యాయి. జూన్ 6న చడీచప్పుడు లేకుండా ఓపీ మొదలై వారంలో ఆగిపోయింది.
సేవలు మొదలైతే ఈ జిల్లాలకు మేలుటిమ్స్లో సేవలు మొదలైతే.. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్ తదితర జిల్లాల వారికి చాలా ప్రయోజనం కలగనుంది.
ఆ పోస్టులు ఏమాత్రం సరిపోవు
టిమ్స్ ఏర్పాటును ప్రకటించాక దాదాపు 40 రోజుల తర్వాత రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. బయో కెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రో బయాలజీ, జనరల్ మెడిసిన్, టీబీసీడీ, రేడీయో డయాగ్నసిస్, అనెస్థీషియా, నర్సింగ్ స్టాఫ్, అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పని చేసేందుకు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సహా 662 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. అయితే ఇవన్నీ కూడా ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిన ఏడాది కోసం చేసే నియామకాలే. తర్వాత కొనసాగిస్తరా, లేదా అన్న అనుమానంతో పెద్దగా ఆసక్తి రాలేదని ఉస్మానియా డాక్టర్లు అంటున్నారు. టిమ్స్లో చేసిన ఏర్పాట్లకు అనుగుణంగా ట్రీట్మెంట్అందాలంటే నోటిఫికేషన్ ఇచ్చిన మేర రిక్రూట్మెంట్ సరిపోదని స్పష్టం చేస్తున్నారు. టిమ్స్కు 300 డాక్టర్లు, 500 మంది నర్సింగ్, 500 మంది పారామెడికల్ స్టాఫ్, 200 మంది శానిటేషన్ స్టాఫ్ అవసరమని అంటున్నారు.
రేడియాలజీ, ఆపరేషన్ థియేటర్లు లేవు
ఏ హాస్పిటల్ అయినా ముందుగానే రేడియాలజీ వింగ్, ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేస్తారు. కానీ టిమ్స్లో అవేవీ లేవు. ఎక్స్రే, సీటీ స్కాన్, ఎంఆర్ఐ అందుబాటులో లేవు. ఆపరేషన్ థియేటర్లు కూడా ఏర్పాటు చేయకుండానే ఇంత పెద్ద ఆస్పత్రిని ప్రారంభించారు. అంటే ఇక్కడ ట్రీట్మెంట్లు మొదలైనా స్కానింగ్ కోసం వేరే హాస్పిటళ్లకు వెళ్లక తప్పదు. ఓపీ ట్రీట్మెంట్ వాళ్లకైనా ఇదే పరిస్థితి.