
కరోనా సోకి చనిపోయిన మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు జిల్లా కలెక్టర్లకు అధికారాలను అప్పగిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి కరోనా మృతుల కుటుంబ సభ్యులకు రూ.50వేల పరిహారం చెల్లించనున్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి 30 రోజుల్లోపే పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. ఇందుకోసం మృతుల కుటుంబ సభ్యులు.. ప్రభుత్వం తెలిపిన అన్ని సర్టిఫికెట్లను ఆన్ లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తులు పరిశీలించిన తర్వాత అర్హులైన వారికి జిల్లా కలెక్టర్ పరిహారం మంజూరు చేయనున్నారు. ఈ మొత్తం ఆధార్ లింక్ అయిన ఖాతాకు నేరుగా బదిలీ చేయనున్నట్టు జీవోలో తెలిపింది. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.