
- దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న క్రీడాకారులు
హైదరాబాద్, వెలుగు : ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ కార్యక్రమాలు, వేడుకలు జరిగిన తర్వాత అక్కడి చెత్తను సిబ్బంది తొలగించడం లేదు. దీంతో స్టేడియం లోపల దుర్వాసనతో ఇబ్బందిపడుతున్నామని క్రీడాకారులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన క్రిస్మస్ వేడుకల అనంతరం ఎల్బీ స్టేడియంలో చెత్తను తొలగించలేదు. తిని పారేసిన ప్లేట్లు అక్కడే ఉన్నాయి. ఈ నెల 7న జరిగిన సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం ఇదే పరిస్థితి నెలకొంది.
ఏ వేడుక లేదా కార్యక్రమం జరిగిన తర్వాత వెంటనే స్టేడియాన్ని క్లీన్ చేయకపోతుండటంతో పరిసర ప్రాంతాల్లో దుర్వాసన వస్తోంది. అయితే, స్పోర్ట్స్ అథారిటీ సిబ్బంది క్లీన్ చేస్తారని జీహెచ్ఎంసీ అధికారులు.. బల్దియా సిబ్బంది క్లీన్ చేస్తారని స్పోర్ట్స్ అథారిటీ సిబ్బంది ఇలా.. ఎవరూ పట్టించుకోకపోవడంతో స్టేడియం లోపల చెత్త అలాగే ఉంటోంది. క్రిస్మస్ వేడుకల తర్వాత వేస్టేజ్ను ఎందుకు క్లీన్ చేయలేదని ఆదివారం ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేష్ దోత్రేని వివరణ కోరగా.. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని వెంటనే క్లీన్ చేయిస్తున్నామని ఆయన చెప్పారు. మరోసాని ఇలా కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.