- పీఎఫ్ఆర్డీఏ నుంచి వేరుకానున్న ఎన్పీఎస్ ట్రస్ట్
న్యూఢిల్లీ: ప్రభుత్వం పెన్షన్ సెక్టార్లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ (ఎఫ్డీఐ) లిమిట్ని 100శాతం వరకు పెంచాలని చూస్తోంది. దీనికి సంబంధించిన బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెట్టనుందని అంచనా. గత సంవత్సరం పార్లమెంట్ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎఫ్డీఐ లిమిట్ని 74శాతం నుంచి 100శాతానికి పెంచింది. 2015లో ఇన్సూరెన్స్ చట్టం సవరణతో 49శాతం నుంచి 74శాతానికి పెంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పెన్షన్ ఫండ్లలో ఎఫ్డీఐ లిమిట్ 49శాతంగా ఉంది.
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ( పీఎఫ్ఆర్డీఏ) చట్టం, 2013 సవరణ ద్వారా ఈ లిమిట్ని పెంచే అవకాశం ఉంది. ఇది వర్షాకాల లేదా చలికాల పార్లమెంట్ సెషన్లో రావొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. అదనంగా, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్ ట్రస్ట్)ను పీఎఫ్ఆర్డీఏ నుంచి వేరు చేసి, చారిటబుల్ ట్రస్ట్ లేదా కంపెనీస్ చట్టం కిందకి మార్చే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉందని అన్నారు.
ఎన్పీఎస్ ట్రస్ట్ను 15 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక బోర్డు నిర్వహించనుంది. ఫండ్స్లో ప్రభుత్వ వాటా ఎక్కువగా ఉండడంతో ఇందులో ఎక్కువ మంది ప్రభుత్వ ప్రతినిధులే ఉంటారు. కాగా, ఎన్పీఎస్ 2004 జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తప్పనిసరిగా మారింది. 2009 మే 1 నుంచి ప్రజలందరికీ స్వచ్ఛందంగా అందుబాటులోకి వచ్చింది.

