- డెడ్ లైన్ ఈ రోజు(శనివారం) 4గంటలకు
- ఇకపై చర్చల్లేవు..సర్కారు ఉక్కుపాదమే
- ఈ పరిస్థితుల్లో సంస్థను కాపాడడం కష్టం : సీఎం
- ఏపీ, ఇతర రాష్ట్రా ల నుంచి బస్సులను తెప్పించాలని ఆదేశం
- 06 బెదిరింపులకు భయపడబోమన్న ఆర్టీసీ జేఏసీ నేతలు
- డెడ్లైన్: ఈరోజు సాయంత్రం 6 గంటలు
హైదరాబాద్, వెలుగు:ఆర్టీసీ సమ్మెపై కఠినంగా వ్యవహరించాలని సర్కారు నిర్ణయించింది. శనివారం సాయంత్రం ఆరు గంటల లోపు ఆయా ఆర్టీసీ డిపోల్లో రిపోర్టు చేసిన వారిని మాత్రమే ఇకపై ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తిస్తామని, విధులకు రాని వారిని తమంతట తాము ఉద్యోగాలు వదిలిపెట్టిన వారిగా పరిగణిస్తామని హెచ్చరించింది. డ్యూటీకి వచ్చే కార్మికులకు పూర్తి స్థాయిలో రక్షణ, ఉద్యోగ భద్రత కల్పిస్తామని.. రాని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగంలో చేర్చుకోబోమని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో విధాన నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రకటించింది. ఇకపై కార్మిక సంఘాలతో ఎలాంటి చర్చలు జరపవద్దని నిర్ణయించింది. దీంతో కార్మికులతో చర్చల కోసం నియమించిన సీనియర్ ఐఏఎస్ ల కమిటీ కూడా రద్దయిపోయింది. ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ గా సందీప్ సుల్తానియాను నియమించింది.
ఢిల్లీ నుంచి రాగానే..
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. శుక్రవారం రాత్రి హైదరాబాద్కు తిరిగి రాగానే ఆర్టీసీ సమ్మెపై ప్రగతిభవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బండా ప్రకాశ్, రంజిత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, సీనియర్ అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో జరిగిన చర్చల వివరాలను ఐఏఎస్ ల కమిటీ సీఎంకు వివరించింది. కార్మికుల డిమాండ్లను పరిశీలించి, పరిష్కరించడానికి సర్కారు సిద్ధంగా ఉందన్నా కూడా సమ్మె కొనసాగించేందుకే కార్మిక సంఘాలు మొగ్గుచూపాయని తెలిపింది.
వద్దన్నా.. సమ్మె చేస్తారా?
ఆర్టీసీ పీకల్లోతు కష్టాల్లో మునిగి ఉందని.. దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా వచ్చే ఆదాయం ఎంతో కొంత ఉపయోగపడే పరిస్థితుల్లో యూనియన్లు సమ్మెకు పిలుపునివ్వడం పట్ల సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆర్టీసీలో సమ్మెలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, సమ్మె చేస్తే కార్మికులను ఉద్యోగంలోంచి తొలగించే అధికారం ఆర్టీసీకి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ విషయంలో చట్ట ప్రకారం నడుచుకోవాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. శనివారం సాయంత్రం ఆరింటిలోగా డ్యూటీలకు వచ్చిన వారిని మాత్రమే ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తించాలని, మిగతా వారిని తమంతట తాము ఉద్యోగాలు వదులుకున్నట్టుగా పరిగణించాలని ఆదేశించారు. కార్మికులు ఆర్టీసీ యూనియన్ నాయకుల ఉచ్చులో పడి సంస్థకు నష్టం చేయవద్దని, తమ ఉద్యోగాలు తామే పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని పేర్కొన్నారు. కార్మికుల డిమాండ్లపై ఇక ఎలాంటి చర్చలూ ఉండవని స్పష్టం చేశారు. ఆర్టీసీని కాపాడడానికి ప్రభుత్వం ఎంతో చేసిందని, కానీ ఆర్టీసీ కార్మికులే ఆర్టీసీని ముంచే పని చేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో ఆర్టీసీని కాపాడడం కష్టమని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
ఏర్పాట్లు చేస్తున్నం..
సమ్మెతో జనానికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయడంపై దృష్టి పెట్టామని.. ఆర్టీసీలో పదివేల బస్సులు నడుస్తున్నాయని, అందులో 2,100 బస్సులు అద్దెకు తీసుకున్నవని అధికారులు సీఎంకు వివరించారు. సుమారు ఐదు వేల మంది తాత్కాలిక డ్రైవర్లుగా చేయడానికి ముందుకు వచ్చారని, మొత్తంగా ఏడు వేలకుపైగా బస్సులు నడపడం సాధ్యమతుందని వివరించారు. ఇక సమ్మెలో పాల్గొనకుండా విధులు నిర్వహించే ఉద్యోగులు, కార్మికులకు తగిన భద్రత కల్పించాలని సీఎం కేసీఆర్ డీజీపీని ఆదేశించారు. డిపోల వద్ద భద్రత కల్పించాలని, బస్సుల రాకపోకలకు ఇబ్బంది కలిగించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.