ముగిసిన గ్రేటర్ ప్రచారం.. పోలింగ్ కేంద్రాలకు తరలనున్న బ్యాలెట్ బాక్సులు

ముగిసిన గ్రేటర్ ప్రచారం.. పోలింగ్ కేంద్రాలకు తరలనున్న బ్యాలెట్ బాక్సులు

మూగబోయిన మైకులు.. చివరి రోజున పతాక స్థాయిలో ప్రచారం

ఎల్లుండి పోలింగ్

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల సమరంలో కీలకమైన ప్రచార ఘట్టం ముగిసింది. ఇవాళ చివరి రోజు కావడంతో అన్ని పార్టీల నేతలందరూ ప్రచారంతో హోరెత్తించారు. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన మహామహులంతా  హైదరాబాద్ లో మకాం వేసి ప్రచారం చేశారు. సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసిన వెంటనే జీహెచ్ఎంసీలో ఓటు హక్కు లేని వారంతా హైదరాబాద్ వదిలి సొంతూళ్లకు.. సొంత నియోజకవర్గాలకు తరలివెళ్లారు. ఇన్ని రోజులు వాడవాడలా కనిపించిన డప్పు చప్పుళ్లు.. మైకుల  హోరు  మూగబోయింది. పోలింగ్ ముగి ముగిసే వరకు నిషేధం విధించడంతో మద్యం దుకాణాలన్నీ మూతపడ్డాయి. దీంతో చివరి నిమిషం వరకు మందుబాబులు మద్యం బాటిళ్లు కొనుగోలు చేసేందుకు వైన్ షాపులు.. బార్ల వద్ద బారులు తీరారు. ఎల్లుండి మంగళవారం పోలింగ్ కోసం బ్యాలెట్ బాక్సులన్నీ డిస్ర్టిబ్యూషన్ సెంటర్లకు తరలిస్తున్నారు. రేపు ఉదయం ఎన్నికల నిర్వహణకు నియమితులైన సిబ్బందికి బ్యాలెట్ బ్యాక్సులు పంపిణీ చేస్తారు. బ్యాలెట్ బాక్స్ లను డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు ఆర్టీసీ కార్గో వాహనాలను వినియోగించనున్నారు. పోలింగ్ నుండి కౌంటింగ్ వరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మంగళవారం పోలింగ్: డిసెంబర్ 1 మంగళవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ఒక వేళ పోలింగ్ జరగని పరిస్థితి ఏర్పడితే గురువారం రీపోలింగ్ జరుగుతుంది.

కౌంటింగ్: డిసెంబర్  4న శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం.. మధ్యాహ్నం 3.30 కంప్లిట్ అయ్యే అవకాశం. ఎక్కువ ఓటర్లు ఉన్న ప్రాంతాలలో  లేట్ అయ్యే అవకాశం

గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం ఓటర్లు:  74 లక్షల 4 వేల 286 మంది ఓటర్లు ( పురుష ఓటర్లు 38,04,286, మహిళా ఓటర్లు 35,46,857.. ఇతరులు 669)

ఎన్నికలకు పరిశీలకులు:  మొత్తం 6 జోన్ లు..  జోన్ లకు ఆరుగురు చొప్పున సాధారణ ఎన్నికల పరిశీలకులు

గ్రేటర్ లో మొత్తం వార్డులు:  150 వార్డులు.

మొత్తం పోలింగ్ కేంద్రాలు:  9101

మొత్తం బ్యాలెట్ బాక్సులు: 28,500

పోలింగ్ సామగ్రి పంపిణీకి బ్డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లు:  30

కౌంటింగ్  కేంద్రాలు:  30

గ్రేటర్ ఎన్నికలకు పనిచేస్తున్న ఎన్నికల సిబ్బంది:  48,000 మంది, పోలీస్ సిబ్బంది దాదాపు  30,000 మంది.

గ్రేటర్ హైదరాబాద్ లో అతి పెద్ద డివిజన్: మైలార్ దేవ్ పల్లి – 79,290 ఓట్లు

అతి చిన్న డివిజన్ రామ చంద్ర పురం: 27,948 ఓట్లు

పోలింగ్ సందర్భంగా నిబంధనలు:  ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి, థర్మల్ స్కానింగ్, శానిటైజర్.

గత మున్సిపల్ ఎన్నికల్లో మాదిరిగా గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఫేస్ రికాగ్న జేషన్ యాప్ సర్కిల్ ఒక పోలింగ్ బూత్ లో ఏర్పాటు చే్స్తోంది ఎన్నికల కమిషన్.