- అడగడుగునా అడ్డుకున్న ఆందోళనకారులు
ఖిలా వరంగల్(మామునూరు), వెలుగు: వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట గ్రామంలో శివాజీ విగ్రహ ఏర్పాటు, దాని తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామంలో రెండు వర్గాల మధ్య గొడవలు జరగకుండా చర్యలు తీసుకునే క్రమంలో తోపులాటలు, వాదోపవాదాలు, స్వల్ప లాఠీఛార్జీతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గతంలో ఓ వర్గం నేతలు అడ్డుకున్నప్పటికీ, గురువారం అర్ధరాత్రి శివాజీ విగ్రహం ఏర్పాటు చేశారు. బొల్లికుంటకు పోలీస్ అధికారులు చేరుకొని గొడవలు జరగకుండా విగ్రహాన్ని తొలగించాలని నిర్ణయించారు.
దీనిపై గ్రామస్తులు అభ్యంతరం చెప్పగా, వారిని ఇండ్ల వద్దనే నిర్బంధించారు. విషయం తెలుసుకున్న వీహెచ్పీ, బీజేపీ నాయకులు విగ్రహం వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు. అడుగడుగునా అడ్డుకుంటున్న ఆందోళనకారులను తప్పిస్తూ పోలీసులు విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు. గ్రామంలోనే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ, వీహెచ్పీ నేతలు డిమాండ్ చేశారు.
