హైదరాబాద్, వెలుగు: గ్రేటర్లోని సీనియర్ సిటిజన్లు హెల్త్పై మరింత ఫోకస్ పెడుతున్నారు. బల్దియా పార్కుల్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లకు వెళ్తూ వాకింగ్తో పాటు ఎక్సర్ సైజ్ లు చేస్తున్నారు. అయితే చాలాచోట్ల ఎక్విప్మెంట్లకు మెయింటెనెన్స్ లేకుండా పోయింది. అధికారులు ఇలాంటివి ఏర్పాటు చేసినప్పుడు వాటి పర్యవేక్షణ కూడా చూసుకోవాలంటూ సీనియర్ సిటిజన్లు కోరుతున్నారు.
మెయింటెనెన్స్ లేక..
గ్రేటర్ పరిధిలోని ఏఎస్ రావు నగర్ పార్కు, ఇబ్లీబన్ పార్కు, ఖైరతాబాద్ క్రిష్ణకాంత్ పార్కు, శేరిలింగంపల్లి గుల్ మెహర్ పార్కు, సికింద్రాబాద్ నెహ్రూ నగర్ పార్కుతో పాటు ఇందిరా పార్కులో జీహెచ్ఎంసీ ఓపెన్ జిమ్లను 2016 లో ఏర్పాటు చేసింది. వీటితో పాటు 2017లో 135 ప్రాంతాల్లో అవుట్ డోర్ జిమ్ లను కమ్యునిటీ హాల్స్లో ఏర్పాటు చేశారు. అయితే మెయింటెనెన్స్ లేకపోవడంతో కొన్ని పరికరాలు పాడైపోతున్నాయి. దీంతో అవి నిరుపయోగంగా మారుతున్నాయి. జనాలకు జిమ్కు వెళ్లాలనే ఆసక్తి ఉన్నా అందుకు తగిన విధంగా పరికరాలు లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. పాడైపోయిన ఎక్విప్ మెంట్స్ స్థానంలో కొత్తవి పెట్టాలని కోరుతున్నారు.
ప్రభుత్వం దృష్టిపెట్టాలి
జనాలకు ఉపయోగపడేందుకు ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లు ఎలా ఉన్నాయో చూడాల్సిన బాధ్యత అధికారులదే. ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవడం కరెక్ట్ కాదు. క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నాయో పరిశీలించాలి. మా కాలనీలోని ఓపెన్ జిమ్లో ఒకటి బాగుంటే మరొకటి బాలేదు.
– భార్గవ్ , సీనియర్ సిటిజన్, కూకట్ పల్లి