ఆలయాల్లో కొలువులకు గ్రీన్ సిగ్నల్.. ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని ఈవోలకు ఆదేశాలు

ఆలయాల్లో కొలువులకు గ్రీన్ సిగ్నల్.. ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని ఈవోలకు ఆదేశాలు
  • అర్చక, ఇతర మతపరమైన పోస్టుల భర్తీకి దేవాదాయ శాఖ చర్యలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని దేవాలయాల్లో ఖాళీగా ఉన్న మతపరమైన పోస్టుల (రిలీజియస్ పోస్టులు) భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. వంశపారంపర్య హక్కులు లేని ఖాళీలను వెంటనే ‘డైరెక్ట్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్’పద్ధతిలో భర్తీ చేయాలంటూ దేవాదాయ శాఖ డైరెక్టర్ ఎస్.హరీశ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులకు మెమో పంపించారు. జాయింట్, డిప్యూటీ, అసిస్టెంట్ కమిషనర్ స్థాయి ఆలయాలు (6-ఏ, బీ, సీ కేటగిరీలు) వారీగా ఈవోలు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.

ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. ఖాళీగా ఉన్న అర్చక, ఇతర వేద పండితుల పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వాలని సూచించారు. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ లేదా ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తులు స్వీకరించాలని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అయితే, ఈ నియామకాల్లో వంశపారంపర్యంగా వచ్చే పోస్టులను, కోర్టు కేసుల్లో ఉన్న పోస్టుల జోలికి వెళ్లొద్దని సూచించారు. అవి పోను మిగిలిన వాటిని మాత్రమే కొత్తగా భర్తీ చేయనున్నారు.