సింగరేణి ఆధ్వర్యంలో ప్రతి అడుగు పచ్చదనం.. హైదరాబాద్ సమీపంలో కోల్ సేల్ పాయింట్ ఏర్పాటు యోచన

సింగరేణి ఆధ్వర్యంలో ప్రతి అడుగు పచ్చదనం.. హైదరాబాద్  సమీపంలో కోల్ సేల్ పాయింట్ ఏర్పాటు యోచన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా సింగరేణి ‘ప్రతి అడుగు పచ్చదనం’ నినాదంతో 675 హెక్టార్లలో 45 లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్​ బలరామ్​ తెలిపారు. సింగరేణి ఏరియా అధికారులు, ఉద్యోగులు, స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. శనివారం (june 14) హైదరాబాద్‌‌లోని సింగరేణి భవన్‌‌లో జనరల్  మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి బిందువు జల సింధువు కార్యక్రమంలో భాగంగా సింగరేణి పరిధిలో 62 మినీ చెరువులు నిర్మించాలని నిర్ణయించామని, ఇప్పటికే 60 పూర్తయ్యాయని తెలిపారు. 43 చెరువుల్లో పూడికతీత పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 

వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు సప్లై చేసేందుకు జీ14, జీ15 గ్రేడ్  బొగ్గు రవాణాను నిలిపివేసి, జీ13 గ్రేడ్  బొగ్గును సరఫరా చేయాలని నిర్ణయించారు. చిన్న తరహా పరిశ్రమల సౌలభ్యం కోసం హైదరాబాద్  సమీపంలో బొగ్గు విక్రయ కేంద్రం ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. భూపాలపల్లి ఏరియాలోని భూగర్భ గనుల కోసం గోదావరి నది నుంచి ఇసుక సేకరణకు క్వారీ ఏర్పాటుకు అనుమతులు సాధించాలని ఆదేశించారు.

డైరెక్టర్‌‌గా గౌతమ్  పొట్రు బాధ్యతల స్వీకరణ

సింగరేణి సంస్థలో డైరెక్టర్(పర్సనల్, అడ్మినిస్ట్రేషన్  అండ్  వెల్ఫేర్)గా నియమితులైన గౌతమ్  పొట్రు బాధ్యతలు స్వీకరించారు. శనివారం హైదరాబాద్‌‌లోని సింగరేణి భవన్‌‌లో సంస్థ సీఎండీ ఎన్.బలరామ్  సమక్షంలో బాధ్యతలు స్వీకరించగా, ఆయనకు బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ డైరెక్టర్లు ఎల్వీ  సూర్యనారాయణ, కె వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్  డైరెక్టర్(కోల్  మూమెంట్) ఎస్డీఎం సుభాని, జనరల్  మేనేజర్ (మార్కెటింగ్) ఎన్వీ రాజశేఖర్ రావు అభినందనలు తెలియజేశారు.