
- వచ్చే నెల 25 నుంచి ట్రైనింగ్ షురూ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మొత్తం12 బీసీ స్టడీ సర్కిళ్లలో గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4, ఆర్ఆర్ బీ, ఎస్ఎస్ సీ, బ్యాంకింగ్ రిక్రూట్ మెంట్ల పరీక్షలకు ఉచిత కోచింగ్ ప్రోగాం వచ్చే నెల 25 నుంచి ప్రారంభించనున్నట్టు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి చెప్పారు. 150 రోజుల పాటు నిర్వహించనున్న ఈ కోచింగ్ లో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1000 స్టైఫండ్ అందచేయనున్నట్టు సోమవారం పత్రిక ప్రకటనలో తెలిపారు.
అర్హులైన అభ్యర్థులు www.tgbcstudycircle.cgg.gov.in ద్వారా ఈ నెల 16 నుంచి వచ్చే నెల 11 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని డైరెక్టర్ సూచించారు. అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతంలో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు కలిగి ఉండాలన్నారు. డిగ్రీ పరీక్షలో అత్యధిక శాతం మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థుల ఎంపిక విధానం ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ 040-–24071178 ను సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి సూచించారు.