గుజరాత్‌‌ టైటాన్స్‌‌ దూకుడు..రాజస్తాన్‌పై విక్టరీ

గుజరాత్‌‌ టైటాన్స్‌‌ దూకుడు..రాజస్తాన్‌పై  విక్టరీ

జైపూర్‌‌‌‌: ఐపీఎల్‌‌–16లో గుజరాత్‌‌ టైటాన్స్‌‌ దూకుడు కొనసాగుతోంది. స్టార్‌‌ స్పిన్నర్‌‌ రషీద్‌‌ ఖాన్‌‌ (3/14), నూర్‌‌ అహ్మద్‌‌ (2/25) స్పిన్‌‌ మ్యాజిక్‌‌కు తోడుగా ఛేజింగ్‌‌లో వృద్ధిమాన్‌‌ సాహా (34 బాల్స్‌‌లో 5 ఫోర్లతో 41 నాటౌట్‌‌), హార్దిక్‌‌ పాండ్యా (15 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 39 నాటౌట్‌‌) చెలరేగడంతో.. శుక్రవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో టైటాన్స్‌‌ 9 వికెట్ల తేడాతో రాజస్తాన్‌‌ రాయల్స్‌‌కు చెక్‌‌ పెట్టింది. టాస్‌‌ గెలిచి బ్యాటింగ్‌‌కు దిగిన రాజస్తాన్‌‌ 17.5 ఓవర్లలో 118 రన్స్‌‌కే ఆలౌటైంది. కెప్టెన్‌‌ సంజూ శాంసన్‌‌ (20 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 30) టాప్‌‌ స్కోరర్‌‌.  తర్వాత గుజరాత్‌‌ 13.5 ఓవర్లలో 119/1 స్కోరు చేసి నెగ్గింది. గత ఐదు మ్యాచ్‌‌ల్లో రాయల్స్‌‌కు ఇది నాలుగో ఓటమి కావడం గమనార్హం. రషీద్​కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

టైటాన్స్​ అలవోకగా..

చిన్న టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో గుజరాత్‌‌ ఎక్కడా ఇబ్బంది పడలేదు. వరుసగా రెండు ఫోర్లతో ఖాతా ఓపెన్‌‌ చేసిన సాహాకు శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (36) అండగా నిలిచాడు. ఫోర్త్‌‌ ఓవర్‌‌లో సాహా ఔట్‌‌ కోసం రాయల్స్‌‌ రివ్యూకు వెళ్లినా సక్సెస్‌‌ కాలేదు. ఆ వెంటనే ఫోర్‌‌ బాదాడు. ఐదో ఓవర్‌‌లో గిల్‌‌ ఒకటి, సాహా రెండు ఫోర్లు కొట్టాడు. ఆరో ఓవర్‌‌లో గిల్‌‌ రెండు ఫోర్లు కొట్టడంతో పవర్‌‌ప్లేలో 49/0 స్కోరు చేసింది. తర్వాతి మూడు ఓవర్లలో 20 రన్స్‌‌ రాబట్టిన ఈ జంటను 10వ ఓవర్‌‌లో చహల్‌‌ (1/22) విడగొట్టాడు. గిల్‌‌ను శాంసన్‌‌ స్టంపౌట్‌‌ చేయడంతో ఫస్ట్‌‌ వికెట్‌‌కు 71 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. స్కోరు 72/1కి  చేరింది. జంపా వేసిన 11వ ఓవర్‌‌లో హార్దిక్‌‌ 6, 4, 6, 6తో 24 రన్స్‌‌ దంచాడు. ఆ తర్వాత మరో రెండు ఫోర్లతో విజయానికి అవసరమైన రన్స్ జోడించాడు.

అఫ్గన్‌‌ స్పిన్నర్ల జోరు.. 

ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన రాజస్తాన్‌‌ బ్యాటర్లు.. ఇద్దరు అఫ్గానిస్తాన్‌‌ స్పిన్నర్లు రషీద్‌‌, నూర్‌‌ అహ్మద్‌‌ స్పిన్‌‌ మ్యాజిక్‌‌కు దాసోహం అయ్యారు. ఈ ఇద్దరు కలిసి ఐదు వికెట్లు తీయడంతో రాయల్స్‌‌ భారీ స్కోరు చేయలేకపోయింది. ఐదో ఓవర్‌‌ వరకు 47/1 స్కోరుతో మ్యాచ్‌‌ను కంట్రోల్‌‌లో ఉంచుకున్న రాజస్తాన్‌‌ ఆ తర్వాత చేతులెత్తేసింది. 71 రన్స్‌‌కే చివరి 9 వికెట్లను కోల్పోయింది. రెండు ఫోర్లతో బట్లర్‌‌ (8) దూకుడు చూపినా.. హార్దిక్‌‌ (1/22) బౌలింగ్‌‌లో షార్ట్‌‌ థర్డ్‌‌ మ్యాన్‌‌లో మోహిత్‌‌ సూపర్‌‌ క్యాచ్‌‌ అందుకున్నాడు. తర్వాత యశస్వి జైస్వాల్‌‌ (14), శాంసన్‌‌ ఇన్నింగ్స్‌‌ను గట్టెక్కించే ప్రయత్నం చేశారు.  సింగిల్స్‌‌తో స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేశారు. ఈ ఇద్దరు రెండో వికెట్‌‌కు 36 రన్స్‌‌ జోడించినా.. పవర్‌‌ప్లే లాస్ట్‌‌ ఓవర్‌‌లో జైస్వాల్‌‌ ఔట్‌‌తో వికెట్లపతనం వేగంగా కొనసాగింది. ఏడో ఓవర్‌‌లో లిటిల్‌‌ (1/24).. శాంసన్‌‌ను పెవిలియన్‌‌కు పంపాడు. తర్వాతి నుంచి రషీద్‌‌ నూర్‌‌ అహ్మద్‌‌ జోరు మొదలుపెట్టగా, చివర్లో  షమీ (1/27) తన వంతు సాయం అందించాడు. అద్భుతమైన టర్న్‌‌కు వరుస విరామాల్లో దేవదుత్‌‌ పడిక్కల్‌‌ (12), అశ్విన్‌‌ (2), రియాన్‌‌ పరాగ్‌‌ (4), హెట్‌‌మయర్‌‌ (7), జురెల్‌‌ (9), బౌల్ట్‌‌ (15), జంపా (7) ఔటయ్యారు. ఓవరాల్‌‌ ఇన్నింగ్స్‌‌లో ఏడుగురు బ్యాటర్లు సింగిల్‌‌ డిజిట్‌‌ స్కోర్లే చేయడంతో రాయల్స్‌‌ చిన్న స్కోరుకే పరిమితమైంది.