ఆస్కార్‌లో‌‌‌ తెలుగు చిత్రాలకు దక్కని స్థానం.. మన దేశం నుంచి వెళ్తున్న లాపతా లేడీస్‌‌..

ఆస్కార్‌లో‌‌‌ తెలుగు చిత్రాలకు దక్కని స్థానం.. మన దేశం నుంచి వెళ్తున్న లాపతా లేడీస్‌‌..

ఒకప్పుడు అందని ద్రాక్షలా ఊరించిన  ‘ఆస్కార్‌‌‌‌’ అనే కల ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో సాకారమైంది. దీంతో మన దేశం నుంచి ఏ సినిమా ఆస్కార్‌‌‌‌ పోటీలో నిలవబోతోంది అనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. 97వ ఆస్కార్ ఈవెంట్ వచ్చే ఏడాది మార్చి 2న జరగబోతోంది.

దీనికోసం వివిధ దేశాల నుంచి అధికారిక ఎంట్రీలు ఖరారు అవుతున్నాయి. మన దేశం నుంచి ఈసారి ‘లాపతా లేడీస్‌‌’ చిత్రాన్ని అఫీషియల్ ఎంట్రీగా నామినేట్ చేసినట్టు ఫిల్మ్‌‌ ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా సోమవారం చెన్నైలో ప్రకటించింది.

ఆమీర్ ఖాన్‌‌ నిర్మాణంలో ఆయన మాజీ భార్య కిరణ్ రావు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. కమర్షియల్ సక్సెస్‌‌తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న  ఈ చిత్రంలో ప్రతిభా రాణా, స్పర్ష్ శ్రీవాస్తవ, నితాన్షి గోయెల్, రవికిషన్ నటించారు. సమాజంలోని కట్టుబాట్లు అమ్మాయిల ఆకాంక్షలను, లక్ష్యాలను ఎలా అణచివేస్తున్నాయనే సీరియస్ ఇష్యూని ఎంటర్‌‌‌‌టైనింగ్‌‌గా చెప్పిన సినిమా ఇది.  

Also Read:-దేవర టికెట్స్ కోసం వెయిటింగా.. బుక్ చేసుకోండి మరి! 

తెలుగు చిత్రాలకు దక్కని స్థానం

తెలుగు, త‌‌మిళ‌‌, మ‌‌ల‌‌యాళ, హిందీ, మ‌‌రాఠీ భాషల నుంచి 29  చిత్రాలు పోటీపడగా 13 మంది సభ్యుల కమిటీ షార్ట్ లిస్ట్‌‌ చేసి ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ‘లాపతా లేడీస్’ను ఎంపిక చేసింది.   తెలుగు నుంచి కల్కి 2898 ఏడీ,  హనుమాన్,  మంగళవారం సినిమాలు పోటీపడ్డాయి.

ఇక గతేడాది మలయాళం నుంచి ‘2018’ అనే చిత్రాన్ని అఫీషియల్ ఎంట్రీగా పంపినా ఆస్కార్‌‌‌‌కు షార్ట్ లిస్ట్‌‌ కాలేకపోయింది. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో చివరగా ఇండియా నుంచి షార్ట్ లిస్ట్ అయిన సినిమా ‘లగాన్‌‌’ (2001). ఆమీర్ ఖాన్ నటిస్తూ నిర్మించిన ఈ చిత్రానికి అవార్డు దక్కలేదు.

23 ఏళ్ల తర్వాత మళ్లీ ఆమీర్ నిర్మించిన  సినిమా ఆస్కార్‌‌‌‌కు వెళుతోంది.  ఈసారి షార్ట్ లిస్ట్‌‌ అవడంతో పాటు అకాడమీ అవార్డును‌‌ కూడా తీసుకొస్తుందని ఆశిద్దాం.