- ఈ ప్రభుత్వానికి ఓ పాలసీ లేదు: హరీశ్ రావు
- రేవంత్ ఏం చేసినా దాని వెనక రియల్ఎస్టేట్ బిజినెస్ ఉంటది
- మధు పార్క్ అపార్ట్మెంట్ నివాసితులకు పరామర్శ
హైదరాబాద్, వెలుగు: మూసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓ పాలసీ లేదని, పూటకో తీరుగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. మూసీని శుద్ధి చేయాలని అందరూ కోరుకుంటారని, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అప్పట్లోనే రూ.3,800 కోట్లతో ఎస్టీపీలను నిర్మించి ఆ పనిని ప్రారంభించిందని గుర్తు చేశారు. అప్పుడు తమ ప్రభుత్వానికి ఒక్క ఇల్లూ కూల్చే ఆలోచన రాలేదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక కచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారమే ఉంటుందన్నారు.
ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరిట ఇండ్లు కూల్చి, భూములు లాక్కొని.. వాటిని అంబానీకో, అదానీకో, మేఘా కృష్ణారెడ్డికో కట్టబెట్టే కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన మధుపార్క్ అపార్ట్మెంట్ నివాసితులను ఆయన కలిశారు. మూసీ రివర్ ఫ్రంట్ప్రాజెక్టులో ఇండ్లను కోల్పోతుండడంతో అపార్ట్మెంట్ వాసులు ఆందోళనలు చేపట్టారు.
ఈ క్రమంలోనే ఆదివారం వారిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘రేవంత్ రెడ్డికి ఈ అపార్ట్మెంట్ అంటే కేవలం ఇటుకలు, సిమెంట్ మాత్రమే కావచ్చు. కానీ, ఒక మధ్యతరగతి వ్యక్తి రెక్కలు ముక్కలు చేసుకుని, బ్యాంకుల చుట్టూ తిరిగి అప్పులు తెచ్చుకుని కట్టుకున్న జీవితకాలపు సొంతింటి కల అది. ఇండ్లు కూల్చడమంటే ఇక్కడి బతుకులను కూల్చడమే. ఇప్పటివరకు మూసీ ప్రాజెక్టుకు అసలు డీపీఆర్ లేదు. ఎఫ్టీఎల్ ఫిక్స్ కాలేదు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాలేదు. అలాంటప్పుడు నోటీసులు ఎలా ఇస్తారు?’’అని ప్రశ్నించారు.
పైసల్లేకుంటే ఫుట్బాల్ మ్యాచ్ ఎట్ల ఆడినవ్
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ఇవ్వాలని అడిగితే డబ్బులు లేవంటున్నారని, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లు, రైతుబంధుకూ నిధులు లేవని చెబుతున్నారని హరీశ్రావు విమర్శించారు. పైసల్లేకుంటే మెస్సీతో ఫుట్బాల్మ్యాచ్లు, మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. బడా కాంట్రాక్టర్లకు రూ.20 వేల కోట్ల బిల్లులు ఇచ్చారని.. కానీ, పేదలకు ఇవ్వమంటే మాత్రం రేవంత్కు డబ్బులుండవా అని ఫైర్ అయ్యారు.
