ఘట్కేసర్, వెలుగు: ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్కు వెళ్తున్నానని చెప్పిన ఓ వ్యక్తి చెరువులో శవమై తేలాడు. ఘట్కేసర్కు చెందిన కిషోర్ (40) కొండాపూర్ సమీపంలోని అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. గతంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఘట్కేసర్ లో ఉన్న తన ఇంటిని విక్రయించడంతో కుటుంబ సభ్యులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో గత నాలుగేండ్లుగా కిషోర్ పనిచేస్తున్న ఆశ్రమంలోనే నివాసం ఉంటున్నాడు.
నాలుగు రోజుల క్రితం ఆరోగ్యం బాగోలేదని, హాస్పిటల్కు వెళ్తానని ఆశ్రమం నుంచి బయటకు వెళ్లాడు. బుధవారం ఉదయం ఘట్కేసర్ సమీపంలోని చెట్టేరుకుంట చెరువులో అతని మృతదేహం కన్పించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. కిషోర్ మృతికి గల కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
