హైబీపీ, షుగర్ పేషెంట్ల కోసం ఆరోగ్య శాఖ హెల్ప్లైన్
నెలకోసారి టెక్నీషియన్ల ఫోన్
హెల్త్ డిపార్ట్మెంట్ ప్రతిపాదనలు
స్టేట్ హెల్త్ సొసైటీ ఆమోదం
హైదరాబాద్, వెలుగు: ఎవరైనా తెలిసినోళ్లు కనిపించినప్పుడు బాగున్నారా అని అడుగుతుంటాం. ఇకపై ఆరోగ్య శాఖ కూడా అదే చేయబోతోంది. ఫోన్ చేసి ఆరోగ్యం ఎట్లుందో వాకబు చేయనుంది. షుగర్, హైబీపీ పేషెంట్లకు నెలకోసారి ఫోన్ చేసి వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోనుంది. అందుకు ఓ హెల్ప్లైన్ సెంటర్ను ఏర్పాటు చేసి, టెక్నీషియన్లను నియమిస్తారు. దాని కోసం రూ.46 లక్షల వ్యయంతో సిద్ధం చేసిన ప్రతిపాదనలకు రెండ్రోజుల క్రితం జరిగిన స్టేట్ హెల్త్ సొసైటీ సమావేశంలో ఆమోదం తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్గా 3 జిల్లాల్లో దానిని ప్రారంభించాలని నిర్ణయించారు. ఆయా జిల్లాల్లోని పేషెంట్లకు టెక్నీషియన్లు నెలకోసారి ఫోన్ చేసి ట్రీట్మెంట్, వాడుతున్న మందులు, ఆరోగ్యంపై ఆరా తీస్తారు. రోజూ ఎక్సర్సైజ్ చేసేలా, మందులు వాడేలా జాగ్రత్తలు చెబుతారు.
అంతేగాకుండా మందుల పంపిణీపై వారి నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు. నెగెటివ్గా చెబితే అధికారులపై ప్రభుత్వంపై చర్యలు తీసుకుంటుంది. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం)లో భాగంగా నాన్ కమ్యూనికెబుల్ డిసీజెస్ గురించి రాష్ట్రంలో సర్వే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా 30 ఏండ్లు దాటిన కోటి మందికి పరీక్షలు చేయగా, సుమారు 15 లక్షల మందికి హైబీపీ, షుగర్ ఉన్నట్టు తేలింది. వీళ్లందరికీ ప్రభుత్వమే ఉచితంగా మందులు పంపిణీ చేయనుంది. ఒక్కొక్కరికి యూనిక్ ఐడీలతో కూడిన బుక్లెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. వాటిని ఎన్సీడీ పోర్టల్లో ఎంటర్ చేసి రోగికి అందుతున్న మెడిసిన్, హెల్త్ చెకప్ల వివరాలను అధికారులు ఆన్లైన్లో పెడతారు. వాటితో పాటే పేషెంట్తో నేరుగా మాట్లాడేలా హెల్ప్లైన్ను ఏర్పాటు చేస్తున్నారు. పేషెంట్లు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రారంభించిన గ్రీవెన్స్ హెల్ప్లైన్ పనిచేయట్లేదు. అధికారులు అవగాహన కల్పించక ఫిర్యాదులు చేసేందుకు ఓ నంబర్ ఉన్నట్టూ చాలా మందికి తెలియదు.