కేరళ రాజకీయాల్లో ఇప్పుడు రవాణా మంత్రి కె.బి. గణేష్ కుమార్ వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. ఆయన భార్య చేసిన ఆరోపణల వల్ల ఆయన మంత్రి పదవిని కోల్పోయే అవకాశం కనిపిస్తోంది.
కేరళ మంత్రి గణేష్ కుమార్ భార్య బింధు మీనన్, ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనను మోసం చేస్తున్నారని, మరొక మహిళతో ఆయన సన్నిహితంగా ఉండటం తాను స్వయంగా చూశానని, ఈ విషయంపై ముఖ్యమంత్రి కుమార్తెకు కూడా ఫిర్యాదు చేసినట్లు ఆమె చెప్పారు.
కేరళలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో ఈ వివాదం ప్రభుత్వంపై పడకుండా ఉండేందుకు, ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆయన్ని రాజీనామా చేయమని కోరే అవకాశం ఉంది.
రవాణా మంత్రికి భార్య ప్రకారం.... మా మధ్య 2023 నుండి సమస్యలు పెరిగాయి. ఆయన తీరు సరిగ్గా లేదు. నేను ఫోటోలు తీస్తుంటే ఆయన సిబ్బంది నా ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. నాకు ఎవరినీ ఇబ్బంది పెట్టాలని లేదు, కానీ నాకు జరిగిన అన్యాయాన్ని చెబుతున్నాను అని బింధు మీనన్ ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు.. ప్రేమించడం నేరం కాదు. నా వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. నేను ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదు అని మంత్రి గణేష్ కుమార్ సమర్థించుకుంటున్నారు.
►ALSO READ | కోల్కతాలో సీఈసీ గ్యాణేష్ కుమార్ కు నిరసన సెగ... నల్ల జెండాలతో గో బ్యాక్ అంటూ నినాదాలు..
విచిత్రం ఏమిటంటే, 2013లో కూడా అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు, ఆయన మొదటి భార్య కూడా ఇలాంటి ఆరోపణలే చేయడంతో ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి రిపీట్ అవుతోంది. మంత్రి భార్యకే న్యాయం జరగకపోతే, ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటి ? అని ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
కేబీ గణేష్ కుమార్ ఎవరు :
కేబీ గణేష్ కుమార్ కేరళ రాజకీయాల్లో ఒక ప్రముఖ నాయకుడు. ఆయన కొల్లం జిల్లాలోని పతనపురం నియోజకవర్గం నుండి వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కేరళ కాంగ్రెస్ (బి) పార్టీకి అధ్యక్షుడు. ఈ పార్టీని ఆయన తండ్రి ఆర్. బాలకృష్ణ పిళ్లై స్థాపించారు. ఆయన తండ్రి కూడా గతంలో మంత్రిగా, ఎంపీగా ఉన్నారు.
గతంలో ఈ పార్టీ 'యూడీఎఫ్' (కాంగ్రెస్ కూటమి)లో ఉండేది. కానీ ఇప్పుడు ఎల్డీఎఫ్ (లెఫ్ట్ కూటమి)లో భాగమైంది. ప్రస్తుతం ఆ పార్టీ తరపున ఉన్న ఏకైక ఎమ్మెల్యే గణేష్ కుమారే, అందుకే ఆయనకు మంత్రి పదవి లభించింది. రాజకీయాల్లోకి రాకముందు ఆయన మలయాళ చిత్ర పరిశ్రమలో సుమారు 100కు పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
