- సీఎం రేవంత్కు ఈబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రవీందర్రెడ్డి లేఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భర్తీ చేయనున్న ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నాలుగేండ్ల వయోసడలింపు ఇవ్వాలని ఈబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వల్లపు రవీందర్రెడ్డి కోరారు. కానిస్టేబుల్ పోస్టులకు వయోపరిమితిని 36 ఏండ్లకు, ఎస్ఐ పోస్టులకు 39 ఏండ్లకు పెంచాలని శనివారం సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాశారు. ఇప్పటికే ప్రకటించిన ఖాళీలకు అదనంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని ఖాళీ పోస్టులను చేర్చాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలను సమగ్రంగా గుర్తించి నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
కొన్నేండ్లుగా పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థులు వయోపరిమితి కారణంగా ఉద్యోగ అవకాశాలు కోల్పోకుండా ప్రభుత్వం మానవతా దృక్పథంతో ప్రత్యేక నిర్ణయం తీసుకోవాలని రవీందర్రెడ్డి కోరారు. ఖాళీ పోస్టులను భర్తీ చేస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన పోలీస్ సిబ్బంది కొరత తగ్గుతుందని తెలిపారు.
