
ముందస్తు నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణలో విస్తారంగా వానలు పడుతున్నాయి. మంగళవారం (మే27) రాష్ట్రంలోని పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, ఆదిలాబాద్, రాజన్నసిరిసిల్ల, మహబూబాబాద్, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. రానున్న రెండురోజులు కూడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడొచ్చిన ఐఎండీ తెలిపింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం, పలిమెల మండలాల్లో మంగళవారం సాయంత్రం వర్షం కురిసింది. కొన్ని చోట్లు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఉదయం నుంచి ఎండలో అల్లాడిపోయిన ప్రజలకు సాయంత్రానికి కొంత ఉపశమనం కలిగింది.
వరంగల్ జిల్లాల్లో కూడా వర్షం కురిసింది. వరంగల్ సిటీ, హనుమకొండ తోపాటు వరంగల్ రూరల్ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నర్సంపేట డివిజన్ లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన సాధారణ వర్షం కురిసింది. తొలకరి వర్షాలతో రైతులు వ్యవసాయ పనులు చేపట్టారు.
మరోవైపు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, నేరడిగొండ, గడియత్నూర్ బజార్, సిరికొండ మండల్లాలో భారీవర్షం కురిసింది. భారీవర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లి ప్రవహించాయి.
రాజన్న సిరిసిల్లా జిల్లాలో కూడా వానలు పడ్డాయి. వేముల వాడలలో దాదాపు రెండు గంటలపాటు వర్షం దంచికొట్టింది. పలు కాలనీలు జలమయమయ్యాయి. 16 వవార్డు నీటమునిగింది.. దీంతో భక్తులకు చెందిన కారు, ఆటో పూర్తిగా వరదలో చిక్కుకుంది. భారీ వర్షాలతో వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట నక్క వాగు భారీగా వరద నీరు చేరడంతో పొంగిపొర్లుతోంది.
ఇక మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం, మహబూబాబాద్, కొత్తగూడ మండలాల్లో ఉరుములు , మెరుపులతో కూడిన వాన పడింది.
జగిత్యాల జిల్లాలో కూడా మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కొడిమ్యాల, కొండగట్టు పరిసర ప్రాంతాల్లో ఉరుములు , మెరుపులతో భారీవర్షం అతలాకుతలం చేసింది. సుమారు రెండు గంటల పాటు దంచికొట్టింది. దీంతో కొండగట్టులో భక్తులు ఇబ్బంది పడ్డారు.
కొడిమ్యాల మండల కేంద్రం నుంచి సూరంపేటకు వెళ్లే దారిలో దమ్మాయిపేట స్టేజి వద్దగల పోతారం వాగు పొంగిపొర్లింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సూరంపేట - గంగారం తండాల మధ్య ఉండే పోతు చెరువు నుండి పెద్ద ఎత్తున నీటి ప్రవాహంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ప్రాంతంలో కట్ట మరమ్మత్తు పనులు పూర్తి కాకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజల ఆందోళన వ్యక్తం చేశారు.