తెలంగాణలో ఎండలు మండుతున్నాయి.రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 21 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డ్ కాగా, మిగతా జిల్లాల్లో 39 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా బుగ్గబావిగూడ, నిర్మల్ జిల్లాల్లో 41 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి. రాబోయే 5 రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ క్రమంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
రానున్న ఐదు రోజులు.. ప్రస్తుతం రికార్డవుతున్న టెంపరేచర్ల కంటే 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఎండలపై ఇప్పటికే అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేశామని చెప్పింది. హైదరాబాద్లోనూ వచ్చే 5 రోజులు ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పింది. అయితే ఉదయం పూట మాత్రం పొగ మంచు పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్లో టెంపరేచర్లు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఇటీవల ‘హీట్ ట్రెండ్స్ ఫర్ హోలీ’ పేరిట క్లైమేట్ సెంట్రల్ అనే సంస్థ వెల్లడించింది.
