- డిగ్రీలు చదివినా ఉద్యోగాలు రాలే
- పాటలు పాడుతూ బతుకుతున్న 12 మంది
పద్మారావునగర్, వెలుగు : పుట్టుకతోనే అంధత్వం వెంటాడినా.. ఆ చీకట్లను చూసి సడలని మనోధైర్యంతో సంగీతాన్నే తమ జీవనాధారంగా మలచుకున్నారు పది మంది అంధ కళాకారులు. ఏపీలోని గుడివాడ, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన వీరు బతుకుదెరువు కోసం ఐదేండ్ల కింద హైదరాబాద్ బాట పట్టారు. ఘట్కేసర్లో ఓ ఇల్లు రెంట్కు తీసుకున్నారు. మూడు బృందాలుగా విడిపోయి సిటీలోని వివిధ కాలనీలు, మెయిన్రోడ్ల చౌరస్తాల వద్ద సాయంత్ర వేళల్లో పెద్ద స్పీకర్, ఇతర ఇన్స్ట్రుమెంట్స్తో పాటలు పాడుతున్నారు. రోడ్ల వెంట వెళ్లేవారు ఇచ్చే డబ్బులతో బతుకులీడుస్తున్నారు.
డిగ్రీలు చదివినా ఉద్యోగాలు రాలే..
అంధ కళాకారుల ఇన్ఛార్జి హేమలతతో మాట్లాడగా ‘తామంతా డిగ్రీ వరకు చదువుకున్నప్పటికీ ఉద్యోగాలు రాక ఆర్కెస్ట్రాను నమ్ముకున్నట్టు చెప్పారు. ప్రభుత్వం నుంచి కేవలం పింఛన్లు మాత్రమే అందుతున్నాయని, తమ పాటలు విని ఆదరించే దాతలు ఇచ్చే డబ్బులతో పది మంది అంధులతో పాటు ఒక సహాయకుడు, వాహన డ్రైవర్ పొట్ట నింపుకుంటున్నామని వివరించారు.
గుర్తింపు కోసం 2016లో ‘మనో నేత్ర బ్లైండ్ సొసైటీ’ని రిజిస్ట్రేషన్ చేయించామన్నారు. అప్పుడప్పుడు కొందరు శుభకార్యాల్లో పాటలు పాడేందుకు పిలిచి సాయం అందిస్తున్నారని, ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని, తమ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు.
