
సినీ రంగుల ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన ఆ తార జీవితాన్ని ఇప్పుడు చీకట్లు కమ్మేశాయి. వెండితెరపై నవ్వులు పూయించిన ఆ నటి ప్రస్తుతం దీన స్థితిలోకి వెళ్లిపోయింది. తనను కాపాడంటూ చేతులెత్తి ఆర్థిస్తోంది. దయనీయ జీవితం గడుపుతున్న నటి పావలా శ్యామల(Pavala shyamala) స్థితి ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. కంటతడి పెట్టిస్తోంది.
తాజాగా పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఆర్థికసాయం అందజేశారు. తన వంతు సాయంగా రూ.లక్షను అందించి ఆమెకు అండగా నిలిచారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్కు సాయిధరమ్తేజ్ రూ.5 లక్షలు విరాళమిచ్చారు. ఇందులో భాగంగా ఫిల్మ్ జర్నలిస్టులు నటి శ్యామల ఇంటికి వెళ్లి రూ.లక్షను అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా హీరో సాయి ధరమ్ తేజ్ వీడియో కాల్ లో మాట్లాడి అండగా ఉంటానని భరోసానిచ్చారు.
‘ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా..చివరికి చనిపోదామనుకున్నా. సమయానికి మీరు సాయం చేసి నాకూ, నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టారు’’ అని శ్యామల కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘‘మీరు కన్నీళ్లు పెట్టుకుంటుంటే కష్టంగా ఉంది. ఏడవకండి’’ అంటూ సాయి ధరమ్ తేజ్ ఓదార్చారు.
వీడియో కాల్ అనంతరం.. శ్యామలా మాట్లాడుతూ..‘‘మా అమ్మాయికి ఆపరేషన్ అయినప్పుడు సాయిధరమ్ తేజ్ నాకు ఫోన్ చేసి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. వచ్చి కలుస్తానన్నారు. చాలా రోజులైపోయింది. ఇక నన్ను మర్చిపోయారేమో అనుకున్నా. కానీ, నన్ను గుర్తుపెట్టుకొని సాయం చేసినందుకు ఆయనకు నా ధన్యవాదాలు’’ అని శ్యామలా తెలిపారు.
Mega Supreme hero @IamSaiDharamTej donated 5 lakhs to the @FilmJournalists. As part of this donation, 1 lakh was given to senior artist #PavalaShyamala Garu, honoring a promise made a few days ago. ?#SaiDurgaTej #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/SNwcEc4qwL
— Telugu FilmNagar (@telugufilmnagar) July 26, 2024
పావలా శ్యామల తన విలక్షణమైన హాస్య నటనతో దశాబ్దాలుగా ఎంతో మంది పెదాలపై నవ్వులు పూయించిన ఆమె.. చాలాకాలంగా దయనీయ జీవితాన్ని గడుపుతున్నారు. నిస్సాహయస్థితిలో ఆమె ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవైపు ఆర్ధిక భారం, మరోవైపు వయోభారంతో నరకం చూస్తున్నారు ఆమె. ఎదిగిన కూతురు కూడా మంచానికి పరిమితమవ్వడంతో.. మానసిక క్షోభను అనుభవిస్తున్నారు పావలా శ్యామల.
తెలుగులో పలు చిత్రాల్లో హాస్యనటి, సహాయనటిగా కనిపించి మెప్పించారు. పావలా శ్యామల నటించి ఫెమస్ అయిన చిత్రాలు చూసుకుంటే ‘గోలీమార్, మనసంతా నువ్వే, ఖడ్గం, ఆంధ్రావాలా, బెంగాల్ టైగర్, బాబు బంగారం, మత్తు వదలరా వంటి చిత్రాలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. ‘మత్తువదలరా’ తర్వాత ఆమె సినిమాల్లో నటించలేదు.