Wayanad Landslide Tragedy: వయనాడ్ విషాదం..బాధితులకి హీరో సూర్య కుటుంబం ఆర్ధిక సాయం

Wayanad Landslide Tragedy: వయనాడ్ విషాదం..బాధితులకి హీరో సూర్య కుటుంబం ఆర్ధిక సాయం

కేరళలోని వయనాడ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా వరద పోటెత్తడంతో కొండచరియలు విరిగిపడి వేలాది ఇండ్లు కొట్టుకుపోయాయి. మెప్పాడి, ముండకై, చురల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మల, అట్టమాల, నూల్పూజ గ్రామాల్లో చోటుచేసుకున్న ఈ ఘోర విపత్తులో వంద మందికి పైగా తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంకొంతో మంది ఆసుపత్రుల్లో గాయాలపాలయ్యారు.

ఇండ్లల్లో పడుకున్న చోటే కొందరు సజీవ సమాధి అయ్యారు. మృతుల్లో మహిళలతో పాటు చిన్నారులు కూడా ఉన్నారు.  ఈ విషాదకర సంఘటన సూర్య ఫ్యామిలీని ఎంతో కలిచివేసింది. ప్రమాదంలో అసువులు బాసిన కుటుంబాలకు తోడుగా నిలవాలని హీరో సూర్య, జ్యోతిక, కార్తీ తమ వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. కేరళ సీఎం సహాయనిధికి సూర్య, జ్యోతిక, కార్తి కలిసి రూ.50 లక్షలను విరాళంగా ఇచ్చారు.

ఈ మేరకు ఈ ఘటన తననెంతో కలచి వేసిందని సూర్య ట్విట్టర్ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. ‘ఇది హృదయ విదారక ఘటన. రెస్క్యూ ఆపరేషన్‌ ద్వారా సాయం చేస్తోన్న ప్రభుత్వ సంస్థల సభ్యులందరికీ మరియు ఫీల్డ్‌లో ఉన్న వ్యక్తులకు ధన్యవాదాలు. ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని విచారం వ్యక్తం చేశారు.సాయం చేయడంలో ఎప్పుడు ముందుండే సూర్య, కార్తీల మరోసారి స్పందించడంతో తమ ఫ్యాన్స్ గర్వంగా ఫీల్ అవుతూ మెసేజ్స్ చేస్తున్నారు. 

ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ తమ వంతు సహాయసహకారాలు అందిస్తున్నారు. హీరో విక్రమ్ కూడా కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.20లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేరళ ప్రభుత్వానికి 5 కోట్ల రూపాయల సహాయ నిధిని ప్రకటించారు.దీంతో ప్రతి పరిశ్రమ నుండి పెద్దలు ముందుకు రావాల్సిందిగా నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.