బషీర్బాగ్, వెలుగు: మారేడుమిల్లిలో ఈ నెల 18న బూటకపు ఎన్కౌంటర్లు చేశారని తెలంగాణ పౌర హక్కుల సంఘం ఆరోపించింది. ఇందులో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతో పాటు మరో ఐదుగురిని భద్రతా బలగాలు హత్య చేశాయని సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ , కార్యదర్శి నారాయణ రావు ఆరోపించారు.
హైదర్ గూడలోని ఎన్ఎస్ఎస్లో శనివారం వారు మాట్లాడారు. హిడ్మాను పోలీసులు నిర్బంధించి , చిత్రహింసలకు గురి చేశారన్నారు. అదుపులో ఉన్న ఆయనను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టకుండా ఎన్కౌంటర్ చేశారన్నారు. నిజానిర్దారణ కోసం ఏపీకి వెళ్తే , తమను అక్కడి ప్రభుత్వం అనుమతించడం లేదన్నారు. బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిగించాలని డిమాండ్ చేశారు.
