గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫ‌లితాల వెల్ల‌డికి హైకోర్టు అనుమ‌తి

గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫ‌లితాల వెల్ల‌డికి హైకోర్టు అనుమ‌తి

గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడించేందుకు TSPSC కి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఓ అభ్యర్థి స్థానికత వివాదంపై టీఎస్ పీఎస్సీ అప్పీలుపై హైకోర్టు విచారణ జరిపింది. అభ్యర్థి స్థానికత వివాదంపై కౌంటరు దాఖలు చేయాలని టీఎస్ పీఎస్సీకి ఆదేశాలు జారి చేసింది. అయితే ప్ర‌స్తుతానికి గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ఫ‌లితాలు విడుద‌ల చేసుకోవ‌చ్చ‌ని కోర్టు సూచించింది. అభ్య‌ర్థి స్థానిక‌త వివాదం త‌ర్వాత తేలుస్తామ‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్వహించిన తొలి 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడికి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( TSPSC) కసరత్తు పూర్తి చేసింది. వీలైనంత త్వరలో ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. TSPSC Group 1 ప్రక్రియపై ఓ అభ్యర్థి కోర్టును ఆశ్రయించడంతో ఎప్పుడో వెలువడాల్సిన ఫలితాలు వాయిదా పడ్డాయి.

తెలంగాణలో 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబర్‌ 16న టీఎస్‌పీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. అక్టోబరు 29న ప్రాథమిక ‘కీ’ విడుదల చేసింది. అభ్యంతరాలను స్వీకరించి, నిపుణుల కమిటీతో చర్చించి, చివరికి 5 ప్రశ్నలను తొలిగించి, నవంబర్‌ 15న తుది ‘కీ’ని వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఆ తర్వాత రెండు, మూడు వారాల్లోనే ప్రిలిమ్స్‌ ఫలితాలు వెల్లడిస్తామని TSPSC ప్రకటించింది. గ్రూప్-1 పై ఓ అభ్యర్థి కోర్టును ఆశ్రయించారు. దీంతో ఫలితాల వెల్లడి ప్రక్రియ ఆగిపోయింది.