కోర్టు ధిక్కరణ కేసులో నలుగురు పోలీసు అధికారులకు 4 వారాల జైలు శిక్షపై తెలంగాణ హై కోర్ట్ స్టే విధించింది. సుప్రీంకోర్డు గైడ్లైన్స్ అమలు చేయని హైదరాబాద్ సిటీ పోలీస్ జాయింట్ కమిషనర్ (గతంలో వెస్ట్జోన్ డీసీపీ) ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ ఎం. సుదర్శన్, జూబ్లీహిల్స్ సీఐ ఎస్.రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ సీహెచ్ నరేష్ లకు నాలుగు వారాల జైలు శిక్ష, రూ. 2 వేల చొప్పున జరిమానా విధిస్తూ జూన్ 7న తీర్పు ఇచ్చింది కోర్టు. ఈ తీర్పుపై నలుగురు అధికారులు అప్పీల్ చేశారు. దీంతో జైలు శిక్షపై హైకోర్టు ఇవాళ స్టే విధించింది . విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.
ఇదీ కేసు..
భార్యాభర్తల వివాదంలో నిందితులుగా ఉన్న భర్త, అత్తకు సీఆర్పీసీ సెక్షన్ 41-ఏ కింద పోలీసులు నోటీసులు ఇవ్వలేదంటూ గతంలో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. సదరు నిందితులు జక్కా వినోద్ కుమార్ రెడ్డి, ఆయన తల్లి సౌజన్యా రెడ్డి తరఫున సుప్రీంకోర్టు అడ్వకేట్ దిల్జిత్ సింగ్ అహ్లువాలియా వాదిస్తూ.. నిందితులకు పోలీసులు సెక్షన్ 41–ఏ కింద నోటీసులు ఇవ్వకపోవడం సుప్రీంకోర్గు గైడ్ లైన్స్ ను ఉల్లంఘించడమేనని అన్నారు. గతంలో బీహార్ వర్సెస్ అర్నేశ్ కుమార్ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు జారీ చేసిన గైడ్ లైన్స్ ను గుర్తు చేశారు. పిటిషనర్లపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను సీక్రెట్ గా ఉంచారన్నారు. హైకోర్టులోని కేసులో పోలీసులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారని, పిటిషనర్ల గురించి తెలిసినప్పటికీ కింది కోర్టులో నిందితులు పరారీలో ఉన్నారని పేర్కొన్నారని చెప్పారు. వారెంట్ జారీ చేశారని, లుక్ఔట్ నోటీసు కూడా ఇచ్చారని వివరించారు. పిటిషనర్లు పరారీలో లేరని, పిటిషనర్ కూతురు బ్యాడ్మింటన్ శిక్షణ కోసం థాయ్లాండ్ వెళ్లారని వివరించారు. పోలీసులకు ఈ–మెయిల్ చేసినా, వినతిపత్రం ఇచ్చినా స్పందించలేదన్నారు. ఎలాంటి నోటీసు జారీ చేయకుండా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారన్నారు. దీంతో పోలీసులు కావాలనే గైడ్ లైన్స్ ను ఉల్లంఘించారని తేల్చిన హైకోర్టు వారికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
