
- కట్టడాల అభివృద్ధికి కమిటీలు వేసి ఈనెల 22న మొదటి సమావేశాలు జరగాలని హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: చారిత్రక కట్టడాల ఆక్రమణలపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. చారిత్రక కట్టడాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు చారిత్రక కట్టడాల అభివృద్ధి కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది. అది కూడా ఈనెల 22లోగా కమిటీ మొదటి సమావేశం జరగాలని హైకోర్టు గడువు విధించింది. చారిత్రక కట్టడాల పరిరక్షణను ఆషామాషీగా తీసుకోరాదని హెచ్చరించిన హైకోర్టు చారిత్రక కట్టడాల అభివృద్ధికి ఖచ్చితమైన బ్లూ ప్రింట్ రూపొందించాలని ఆదేశాలిచ్చింది. గోల్కొండ, కుతుబ్ షాహీ టుంబ్స్ దెబ్బతిన్నాయంటూ మీడియాలో, పత్రికల్లో వచ్చిన కథనాలపై హైకోర్టులో విచారణ జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల 12న నివేదికలు సమర్పించడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణకు చివరి నిమిషంలో నివేదికలు ఇవ్వడం బాధ్యతా రహితమని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో 27 చారిత్రక కట్టడాలు ఉన్నాయని పురావస్తు శాఖ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఒక్క గోల్కొండ పరిసరాల్లో 151 అక్రమ నిర్మాణాలు వెలిశాయని అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఏఎస్ జీ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు అక్రమణల తొలగింపు, రోడ్లు, విద్యుత్ అభివృద్ధి కూడా ప్రణాళికలో ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. కమిటీ సమావేశాలు, నిర్ణయాలపై నివేదిక సమర్పించాలని పురావస్తు శాఖ కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలిస్తూ.. తదుపరి విచారణ జూన్ 10కి వాయిదా వేసింది.