హైదరాబాద్, వెలుగు: రెండో విడత దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపిక ఉత్తర్వులపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. నియోజకవర్గానికి 1100 కుటుంబాలను గుర్తించాలంటూ కలెక్టర్లకు ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జూన్ 24న ఇచ్చిన జీవో 8ని సవాలు చేస్తూ హైదరాబాద్ కు చెందిన కె.అఖిలశ్రీ గురు తేజ.. హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ పై చీఫ్ జస్టిస్ అలోక్ అరధే, జస్టిస్ వినోద్ కుమార్తో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది. ఎలాంటి గైడ్లైన్స్ లేకుండా హుజూరాబాద్ను మినహాయించి లబ్ధిదారులను గుర్తించాలని ఇచ్చిన ఉత్తర్వులు చట్టవ్యతిరేకమని పిటిషనర్ తరపు అడ్వొకేట్ వాదించారు. పొలిటికల్ రికమెండేషన్స్ ఉంటేనే ఎంపిక చేస్తున్నారని చెప్పారు.