
హైదరాబాద్: హుస్సెన్సాగర్లో వినాయకుడి నిమజ్జనాలు చేయోద్దంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తక్షణం ఆంక్షలు అమలుచేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హుస్సెన్సాగర్లో నీరు కలుషితం కాకుండా ఉండాలంటే.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలు నిమజ్జనం చేయకూడదని చెప్పింది. ఈ రకమైన విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ప్రత్యేక కుంటలు ఏర్పాటుచేయాలని సూచించింది. ఈ క్రమంలో ట్యాంక్బండ్ వైపు నిమజ్జనానికి అనుమతించొద్దని హైకోర్టు చెప్పింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యేకంగా రబ్బరు డ్యాం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అక్కడే ఈ విగ్రహాలను నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ నేపథ్యంలో చిన్న, పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలని కోర్టు సూచించింది. మట్టి విగ్రహాలను నిమజ్జనం చేసుకోవచ్చని తెలిపింది. దూర ప్రాంతాల నుంచి నిమజ్జనాల కోసం ఒకే రోజు హుస్సేన్ సాగర్కు రాకుండా ప్రణాళికలు ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. చిన్న విగ్రహాలను ఇళ్లలోనే బకెట్లలో నిమజ్జనం చేసేలా ప్రోత్సహించాలని తెలిపింది. నిమజ్జనం రోజున ఉచితంగా మాస్కులు అందించాలని చెప్పింది. నిమజ్జనం తర్వాత వెంటనే డెబ్రీస్ తొలగించాలని ఆదేశించింది. నిమజ్జనానికి వచ్చే వారు భౌతిక దూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలిపింది. రోడ్లపై రాకపోకలకు ఆటంకం కలిగేలా మండపాలు ఉండొద్దని ఆదేశించింది. మండపాల వద్ద ఎక్కువమంది గుమిగూడకుండా పోలీసులు చూడాలని చెప్పింది. మండపం నిర్వాహకులు శానిటైజర్లు ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది. ఆన్లైన్, సామాజిక మాధ్యమాల ద్వారా దర్శనాలను ప్రోత్సహించాలని హైకోర్టు చెప్పింది. రాత్రి 10 తర్వాత మైకులను అనుమతించొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.