పీజీ డాక్టర్లు సర్వీసులో చేరడానికి గడువు విధించొద్దు..ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

పీజీ డాక్టర్లు సర్వీసులో చేరడానికి గడువు విధించొద్దు..ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: మెడికల్ పీజీ చేసిన అభ్యర్థులు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో తప్పనిసరిగా సేవలందించాలన్న నిబంధన అమలుకు గడువు విధించరాదంటూ హైకోర్టు బుధవారం ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.మెడిసిన్​లో పీజీ పూర్తి చేసి రిజిస్ట్రేషన్​కు ముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో తప్పనిసరిగా సేవలందించాలన్న నిబంధనను సవాలు చేస్తూ 46 మంది డాక్టర్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని జస్టిస్ జె. శ్రీనివాసరావు విచారించారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కోర్సు పూర్తయినప్పటికీ సర్టిఫికెట్లను విడుదల చేయడంలేదని తెలిపారు.

ప్రభుత్వ సర్వీసు తప్పనిసరిగా చేయాలంటూ అడ్మిషన్ల సమయంలోనే రూ.50 లక్షల బాండ్ తీసుకున్నారని చెప్పారు. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని పేర్కొన్నారు. తప్పనిసరిగా ప్రభుత్వ సర్వీసు అందించాలంటూ ప్రభుత్వం 2017లో జారీ చేసిన జీవోను కొట్టివేయాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రభుత్వ వివరణ కోరుతూ విచారణను ఈనెల 27కు వాయిదా వేశారు. ఈలోగా సర్వీసులో చేరడానికి గడువు విధించరాదని ఆదేశాలు జారీ చేశారు.