
హైదరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఇండస్ట్రియల్ ఎస్టేట్ బొల్లారంలోని మైలాన్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ (మాట్రిక్స్ ల్యాబొరేటరీస్)కి హైకోర్టులో ఊరట లభించింది. ఆ కంపెనీపై కఠిన చర్యలు తీసుకోరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్తు సరఫరా నిలిపివేతతోపాటు ఆ కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ)ను ఆదేశించింది.
ఫైర్ యాక్సిడెంట్ల నేపథ్యంలో మైలాన్ ల్యాబ్స్కు చెందిన ర్యాండ్ ఫెసిలిటీతోపాటు విద్యుత్ సర్వీస్ను నిలిపివేస్తూ పీసీబీ నిర్ణయం తీసుకోవడాన్ని ఆ కంపెనీ హైకోర్టులో సవాలు చేసింది. ఈ పిటిషన్ ను హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు... కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా చర్యలు ఎలా తీసుకుంటారని పీసీబీని ప్రశ్నించింది. ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని పీసీబీని ఆదేశించింది.