చెరువుల రక్షణకు ఏం చేస్తున్నరు?

చెరువుల రక్షణకు ఏం చేస్తున్నరు?

వచ్చే నెల 6లోగా అఫిడవిట్ ఇవ్వండి
సర్కారుకు హైకోర్టు ఆదేశం
కోర్టు ఆర్డర్ నే పట్టించుకోరా?
రంగారెడ్డి కలెక్టర్ పై ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: చెరువులు కబ్జా కాకుండా రక్షించకపోతే తెలంగాణ కూడా రాజస్థాన్ ఎడారిలా మారుతుందని హైకోర్టు హెచ్చరించింది. చెరువులను కాపాడేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చెరువులు, కుంటలను కాపాడేందుకు అనుసరిస్తున్న విధానాలు, గైడ్‌లైన్స్‌ ఏమిటో చెప్పాలని అడిగింది. చెరువుల రక్షణకు డీఎస్పీ స్థాయి పోలీస్‌ అధికారి సభ్యుడిగా ఉండేలా ప్రొటెక్షన్‌ కమిటీలు వేయాలని గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులను ఎంతవరకు అమలు చేశారో చెప్పాలని కోరింది. ఒక్క రంగారెడ్డి జిల్లాలోని చెరువుల ఆక్రమణలపై 5 పిల్స్‌ వచ్చాయంటే ఆక్రమణలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. ఖాజాగూడ చెరువుల నిర్మాణాలపై సామాజిక కార్యకర్త లుబ్నా సార్వత్‌ వేసిన పిల్‌ను చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌ రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ సోమవారం మరోసారి విచారించింది.

కలెక్టర్ ఎందుకు బద్ధకిస్తున్నరు?
‘‘రంగారెడ్డి జిల్లాలో చెరువులు కబ్జా అవుతుంటే కలెక్టర్‌ ఏం చేస్తున్నారు? కబ్జాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలంటే కలెక్టర్‌ ఎందుకు బద్ధకిస్తున్నారు? ఎఫ్ టీఎల్ ఖరారుకు ప్రభుత్వ విధానాలు ఏమిటి? పోలీసుల ప్రమేయం లేకుండా కబ్జాలను అడ్డుకోవడం కష్టం. కమిటీలో డీఎస్పీ ఉన్నారా? లేదా? పూర్తి వివరాలతో వచ్చే నెల 6 లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలి’’ అని ప్రభుత్వాన్ని బెంచ్ ఆదేశించింది. పిటిషనర్‌ లాయర్‌ ప్రతాప్‌కుమార్‌ వాదిస్తూ ఎఫ్ టీఎల్ ఖరారు చేశాక మార్పునకు వీల్లేదని, చెరువు విస్తీర్ణం ఎలా తగ్గిందో చెప్పాలన్నారు. తదుపరి విచారణ సెప్టెంబర్‌ 8కి వాయిదా వేశారు.

For More News..

ఎస్పీ బాలు కోలుకోవాలంటూ రజనీ కాంత్ వీడియో

ధోనీ కెప్టెన్సీపై వేటును ఆపాను

ఫేస్ బుక్ పై పొలిటికల్ హీట్