
- ఓల్డ్ సిటీ మెట్రో పనులపై హైకోర్టు స్టే
- చార్మినార్, ఫలక్నుమా ప్రాంతాల్లో మెట్రో పనులను చేపట్టొద్దని ఆదేశాలు
- వారసత్వ కట్టడాల పరిరక్షణపై పిటిషన్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో రైల్వే ప్రాజెక్ట్ రెండో దశలో భాగంగా వారసత్వ కట్టడాలైన చార్మినార్, ఫలక్నుమా ప్రాంతాల సమీపంలో ఎలాంటి పనులు చేపట్టరాదంటూ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారసత్వ కట్టడాల పరిరక్షణపై ఎలాంటి అధ్యయనం లేకుండా వాటి సమీపంలో మెట్రో కారిడార్- 6 పనులు చేపట్టడాన్ని సవాలు చేస్తూ యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ (ఏపీడబ్ల్యూఎఫ్) హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుకల బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మెట్రో పనుల కారణంగా వారసత్వ కట్టడాలైన చార్మినార్, ఫలక్నుమా సమీపంలోని పలు నిర్మాణాలకు ప్రమాదం పొంచి ఉందని తెలిపారు.
ఈ నిర్మాణాల పటిష్టతపై అధ్యయనానికి నిపుణులతో కూడిన స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ వారసత్వ కట్టడాల రక్షణ చట్టం, కేంద్ర పురావస్తు శాఖ చట్ట నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకున్నాకే పనులను కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్లో కౌంటరు దాఖలు చేయడానికి 3 వారాల గడువు కావాలని అదనపు ఏజీ కోరడంతో అనుమతించిన ధర్మాసనం.. అప్పటివరకు చార్మినార్, ఫలక్నుమాల సమీపంలో ఎలాంటి పనులను చేపట్టరాదంటూ ఉత్తర్వులు జారీ చేసింది.